లాన్స్ నాయక్ హనుంతప్పకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: సియాచిన్ మంచు కొండల్లో ఆరు రోజుల పాటు సజీవంగా తన ప్రాణాలను నిలుపుకొని, ఆ తర్వాత మూడు రోజులు మృత్యువుతో పోరాడి అశువులు బాసిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు అరుదైన గౌరవం లభించింది.
భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ లాన్స్ నాయక్ హనుంతప్పకు ఘన నివాళి అర్పించింది. ఇందులో భాగంగా ఆర్ధిక శాఖ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలో ఉండే ప్రభుత్వ చిహ్నం స్థానంలో లాన్స్ నాయక్ హనుమంతప్ప ఫోటోను వాల్ పేపర్గా ఉంచి అంజలి ఘటించారు.
"వీర జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప మరణం నా మనసును తీవ్రంగా కలచివేస్తోంది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి బయటపడి నిలబడాలని కోరుకుంటున్నాను" అని అరుణ్ జైట్లీ తన ట్విట్టర్లో సందేశాన్ని పోస్టు చేశారు. కాగా, హనుమంతప్ప మృతదేహం ఇప్పటికే కర్ణాటకలోని ఆయన స్వగ్రామానికి చేరుకోగా, శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
Saddened to know that L/Nk Hanumanthappa our brave soldier is no more. May God give his family the strength to bear this great loss.
— Arun Jaitley (@arunjaitley) February 11, 2016
కాగా ఫిబ్రవరి 3న 19,600 అడుగుల ఎత్తులోని సియాచిన్ గ్లేసియర్లోని సైనిక శిబిరంపై భారీ ఎత్తున మంచు కొండ చరియలు విరిగిపడటంతో చెన్నైకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో పాటు మొత్తం పది మంది సైనికులు దాని కింద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
అయితే వారిలో లాన్స్ నాయక్ హనుమంతప్ప మాత్రమే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆరు రోజులు పాటు సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, అతడి శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో కోమాలోకి వెళ్లిన హనుమంతప్పు చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.