నరేంద్ర మోడీ -బీజేపీ దెబ్బ: కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టం, ఆర్థిక ఇబ్బందులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? అంటే అవుననే అంటున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అనుసరించే వ్యూహాలు పక్కన పెడితే ఇది ఆ పార్టీకి కొత్త కష్టమని అంటున్నారు. పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు రాకపోవడంతో ఖజానా ఖాళీ అయింది. కార్యకర్తలు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
చెప్పినట్లే మోడీ గుర్రాన్ని కట్టేశా: కుమారస్వామి, సర్దుకుపోండి.. మన అవసరం: సోనియాగాంధీ
తమ వద్ద తగిన నిధులు లేవని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ దివ్వ స్పందన అంగీకరించారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్లు కూడా బీజేపీకి వచ్చినట్టుగా తమకు రావడం లేదన్నారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి కాంగ్రెస్కే ఎక్కువగా విరాళాలు వచ్చేవని, మోడీ-అమిత్ షా ద్వయం ఆధ్వర్యంలో బీజేపీ విజయాలు, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో అందరూ ఆ వైపు మరలుతున్నారని చెప్పారు.
సమాచారం మేరకు.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర శాఖలను నిధులు పంపించడం లేదట. ఖర్చులు తగ్గించుకోవాలని నేతలను కోరింది. డబ్బులు లేకపోవడంతో పార్టీ కార్యాలయాలకు వచ్చే అతిథులకు ఇచ్చే టీ కోసం పెట్టే ఖర్చులపైనా ఆంక్షలు విధించింది. నాయకుల ప్రయాణాలపైనా పరిమితులు విధించింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి నిధుల కొరతేననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏడీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ నివేదిక ప్రకారం కాంగ్రెస్కు 2017లో రూ.225 కోట్ల ఆదాయం ఉంది. బీజేపీకి ఆదాయం రూ.1,034 కోట్లుగా ఉంది. బీజేపీ ఆదాయంలో కేవలం నాలుగో వంతు మాత్రమే సంపాదించగలిగింది. 2014 ఎన్నికల్లో బీజేపీరూ.588 కోట్లు, కాంగ్రెస్ రూ.350 కోట్లు విరాళాలుగా సేకరించాయి. ఢిల్లీలో బీజేపీ నూతన హంగులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోగా, కాంగ్రెస్ కార్యాలయం పనులు ఆగిపోయాయి. మరోవైపు పార్టీ రోజువారీ కార్యకలాపాలకు నిధుల కొరత లేదని కాంగ్రెస్ ఆదివాసీ విభాగం అధ్యక్షుడు కిశోర్ చంద్రదేవ్ చెప్పారు.