కానరాని ‘వ్యూహం’: ఈ ప్రముఖుడి ఆచూకీ చెబితే రూ. 5 లక్షలు నజరానా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనిపించడం లేదంటూ.. ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల నజరానా కూడా ఇస్తామని లక్నోలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు.
లక్నో: అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. ఏకంగా లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దే ఈ పోస్టర్ దర్శనమిచ్చింది. అంతేకాదు, కిషోర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల నజరానా కూడా ఇస్తామని అందులో ప్రకటించారు.
గత లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయానికి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ గెలుపునకు కారణమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ ఉత్తరప్రదేశ్ లో పని చేయలేదు.
ఎస్పీతో జతకట్టినా...
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో జతకట్టినా కాంగ్రెస్ చతికిల పడింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ప్రశాంత్ కిషోర్ పైనా విమర్శలు వెల్లువెత్తాయి.
దారుణ ఓటమి...
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లే గెలిచింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కాంగ్రెస్ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి. యూపీ ఫలితాల తరువాత కాంగ్రెస్ లోనే అంతర్గతంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రక్షాళన అవసరం...
పార్టీని ప్రక్షాళనం చేయాలనే డిమాండ్లు వినవచ్చాయి. రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపైనే సందేహాలు వెల్లువెత్తాయి. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాజేష్ సింగ్ ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు.
రక్తం ధార పోశాం...
అయినా సరే, కిషోర్ పై చేసిన విమర్శలను రాజేష్ సింగ్ సమర్థించుకున్నారు. తాము పార్టీ కోసం రక్తం ధారపోస్తే, కిషోర్ తమపై స్వరీ చేశారని, ఎన్నికల్లో తమ అభిప్రాయాలను పూర్తిగా విస్మరించారని, ఓటమికి ఆయన కారణమని నిందించారు.
పాచిక పారలేదు...
యూపీ ఎన్నికల సందర్భంగా ముందు కిశోర్ అభిప్రాయాలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు విభేదించారన్న వార్తలు వచ్చాయి. ఏదేమైనా నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ లను వియజపథాన నడిపించిన ప్రశాంత్ కిషోర్.. యూపీ విషయానికొచ్చే సరికి విఫలయ్యారు.. ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు.