మాస్క్ ధరించకపోతే.. విమానం మోతే: కళ్లు తిరిగే ఫైన్: మూడింతలు పెంపు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ ఆరంభమైందనే సంకేతాలను పంపిస్తోంది. దసరా, దీపావళి పండగ సీజన్ ముందు నుంచే ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. పండగ సీజన్ ముగిసే నాటికి భారీగా పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలనేవీ ఢిల్లీవాసులు పాటించట్లేదని భావించిన అరవింద్ కేజ్రీవాల ప్రభుత్వం.. కఠిన నిర్ణయాలను తీసుకుంది.
22న అసెంబ్లీ: కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం: ప్రొటెం స్పీకర్గా మాజీ ముఖ్యమంత్రి
మాస్క్ ధరించకుండా తిరిగే వారిపై జరిమానాల కొరడాను ఝుళిపించింది. ఏకంగా 2,000 రూపాయల జరిమానాను విధించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 500 రూపాయల జరిమానా మొత్తాన్ని 2,000కు పెంచింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలను మరింత అప్రమత్తులను చేయడం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకన్నట్లు వెల్లడించారు. ఛాత్ పూజ వేడుకలను తాము నిషేధించట్లేదని తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న సమయంలో ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అఖిల పక్ష భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు. ప్రజలు ఇళ్లల్లో జరుపుకొనే పండగలను నిషేధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అన్నారు.
అందుకే- పండగలను యధాతథంగా నిర్వహించుకోవచ్చని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో మాత్రం మాస్కులను ధరించాలని సూచించారు. దీనికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశామని, ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాను విధిస్తామని అన్నారు. ఇదివరకు 500 రూపాయల జరిమానాను విధించినప్పటికీ.. ప్రజలెవరూ దాన్ని ఖాతరు చేయలేదని, అందుకే జరిమానా మొత్తాన్ని పెంచామని స్పష్టం చేశారు.