మ్యాచ్ తెచ్చిన తంటా : ప్రమాదంలో తెగిన వేలు.. అతికించమని హాస్పిటల్కు వస్తే..
కలకత్తా : హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి వేలు కోల్పోయేందుకు కారణమైంది. మ్యాచ్ చూస్తూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలు మాయమైంది. కోల్కతాలో జరిగిన ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వేలు కోల్పోయేలా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోల్కతాకు చెందిన నీలోత్పల్ చక్రవర్తి హౌరా జిల్లాలో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆఫీస్ వద్ద ప్రమాదం జరగడంతో అతని చేతి వేలు తెగిపోయింది. వెంటనే సహోద్యాగులు స్థానిక ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. తెగిపోయిన వేలును ఓ ప్లాస్టిక్ సంచిలో వేసి హాస్పిటల్ సిబ్బందికి అప్పజెప్పారు. అయితే సర్జరీ చేసే సమయానికి వేలు కనిపించలేదు. సిబ్బంది దాన్ని ఎక్కడో పారేయడంతో ఎంత వెదికినా దొరకలేదు.
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగిన వేలును ప్లాస్టిక్ కవర్లో ఉంచి హాస్పిటల్ సిబ్బందికి అందించామని, వారు ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్ చూస్తూ దాన్ని భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించడంతోనే వేలు మాయమైందని అన్నారు. హాస్పిటల్ సిబ్బందిపై బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే చేతి వేలు మాయం కావడంతో హాస్పిటల్ యాజమాన్యం కొత్త పల్లవి అందుకుంది. దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదని అంటోంది. అయినప్పటికీ వేలు మిస్ కావడంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పింది. హాస్పిటల్కు తీసుకొచ్చిన తెగిన వేలు రక్తంతో తడిసి ఉందని, దాన్ని మళ్లీ అతికించినా ప్రయోజనం ఉండదని డాక్టర్లు అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు హాస్పిటల్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా విచారణ జరుపుతామని చెప్పారు.