బ్యాంకులకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. బ్యాంకులకు వరుస సెలవుల కారణాన్ని దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం నెలకొంది. వరుస సెలవుల కారణంగా ఖాతాదారుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా బ్యాంకులు చెబుతున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు శనివారం నుండి మంగళవారం వరకు మూత పడబోతున్నాయి. ఏప్రిల్ 28 నాలుగో శనివారం కావడంతో యథావిథిగా బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. ఏప్రిల్ 29 ఆదివారం, సోమవారం బుద్ధ పూర్ణిమ, మంగళవారం కార్మిక దినంతో బ్యాంకులు ఈ సెలవులను పాటిస్తున్నాయి.
అయితే సోమవారం, మంగళవారం రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి బ్యాంకులు మూసివేయరు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈ సెలవులను బ్యాంకులు పాటిస్తాయి.
బుద్ధ పూర్ణిమ రోజున మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాలో బ్యాంకులు మూసివేయనున్నారు. లేబర్ డేను పురస్కరించుకొని కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో, గోవాల్లో సెలవులను పాటించనున్నాయి.
ఈ సెలవుల నేపథ్యంలో బ్యాంకులు మూత పడినా ఏటీఎంలు మాత్రం ఎప్పడికప్పుడూ నింపుతూనే ఉంటామని బ్యాంకు అధికారులు ప్రకటించారు. . ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి కార్యకలాపాలను కూడా యథావిథిగా కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు.
ఇటీవలే నగదు కొరతతో కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ సమస్య అంతగా మెరుగు పడలేదు.