పని మనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు నమోదు
న్యూఢిల్లీ: అస్సాం ప్రతిపక్ష ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేశారంటూ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. బోకో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఎమ్మెల్యే తనను గత నెల 29న రేప్ చేశాడంటూ 14 ఏళ్ల బాలిక మందిరా ఔట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ గౌహతి నగరంలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.
బాలిక ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నేరస్థులు ఎవరైనా వదిలేది లేదని, చట్టం తనపని తాను చేసుకు పోతుందని కామరూప్ జిల్లా ఎస్పీ ఇంద్రాణి బారువా తెలిపారు. గోపీనాథ్ దాస్ అస్సాంలోని బోకో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
అయితే, తన ఇంట్లో పనిమనిషి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ ఖండించారు. ఇదంతా తనపై చేసిన కుట్ర అని, ఇది నూరుశాతం తప్పుడు కేసేనని తెలిపారు. బాలిక ఆరోపణలలో వాస్తవం ఎంతన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు.
కొన్ని రోజుల క్రితం ఆమె తన ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని పారిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణల విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, అస్సాం స్టూడెంట్స్ యూనియన్, వివిధ విద్యార్ధి సంఘాలు నేతలు ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన నిర్వహించారు.