నకిలి ఐటీ దాడులు, ఎయిర్ పోర్ట్ కస్టమ్స్, సెంట్రల్ జీఎస్ టీ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు!
బెంగళూరు: నకిలి ఆదాయపన్ను సోదాలు (ఐటీ దాడులు) చేసిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు)కు చెందిన 21 మంది కష్టమ్స్ అధికారుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరు వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వ్యాపారవేత్తకు లంచం ఇవ్వాలని కష్టమ్స్ అధికారులు వేదింపులకు గురి చేశారని కేసు నమోదు అయ్యింది. బెంగళూరులో ఎండి. కృపాలాని అనే వ్యాపారవేత్త నివాసం ఉంటున్నారు. 2017లో వ్యాపారవేత్త కృపాలాని కొన్ని వస్తువులను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంకు తీసుకొచ్చారు.
ఆ సందర్బంలో సరైన పత్రాలు లేవని కస్టమ్స్ అధికారులు కృపాలానికి చెందిన వస్తువులను సీజ్ చేశారు. తాము సీజ్ చేసిన వస్తులు విడిచిపెట్టాలంటే రూ. 10 లక్షలు లంచం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు డిమాండ్ చేశారని వ్యాపారవేత్త కృపాలాని ఆరోపించారు.
లంచం ఇవ్వడానికి కృపాలాని నిరాకరించారు. ఆ సమయంలో సెంట్రల్ జీఎస్ టీ అధికారుల సహాయంతో కస్టమ్స్ అధికారులు కృపాలాని ఇంటిలోకి ప్రవేశించి తాము ఆదాయపన్ను శాఖ అధికారులు అంటూ సోదాలు చేశారు. తన ఇంటిలో కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారని, ఆదాయపన్ను శాఖ అధికారులు కాదని గుర్తించిన కృపాలాని హైకోర్టును ఆశ్రయించి అర్జీ సమర్పించారు.
అర్జీ విచారణ చేసిన హైకోర్టు కస్టమ్స్ అధికారులు, సెంట్రల్ జీఎస్ టీ అధికారులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సూపరెండెంట్ ఆఫ్ కస్టమ్స్, డిప్యూటీ సూపరెండెంట్, ఇన్స్ పెక్టర్ ఆఫ్ కస్టమ్స్ అధికారులు, సెంట్రల్ జీఎస్ టీకి చెందిన 7 మంది అధికారులతో సహ మొత్తం 21 మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు.