కష్టాల్లో కేరళ సీఎం ఉమెన్ చాందీ.. ఆర్ధికమంత్రిపై లంచం కేసు..!
న్యూఢిల్లీ: కేరళలో ఉమెన్ చాందీ సర్కారుకు కష్టాల్లో పడింది. ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి కేఎం మణిపై విజిలెన్స్, ఏసీబీ లంచం కేసు నమోదు చేసింది. కేరళలో గత ఏడాది మూతబడిన 418 బార్లను తెరిపించడానికి ఆయన కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
బార్ల లైసెన్సులను తిరిగి పునరుద్ధరించేందుకు ఆర్ధికమంత్రి తనను ఐదు కోట్లు రూపాయల లంచం అడిగారని, అందుకు తన తోటి సభ్యల నుంచి సేకరించిన కోటి రూపాయలు ఇచ్చానని కేరళ హోటళ్లు, బార్ల సంఘం అధ్యక్షుడు బిజు రమేష్ గత నెలలో ఓ టీవీ షోలో అరోపణలు చేశారు.
ఐతే ఆ ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఖండించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు. ఈ లంచం కేసు కేరళ అసెంబ్లీ సమావేశాలను కూడా కుదిపివేసింది. ఆర్ధిక మంత్రి కేఎం మణి రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. చివరకు ఢిల్లీలోని విజిలెన్స్, ఏసీబీ జోక్యం చేసుకోవడంతో ఆర్ధిక మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.