ఎంత చెప్పినా వీరు మారరు: ఈ బీజేపీ నేత ఎలాంటి వ్యాఖ్యలు చేశాడంటే...?
ఉత్తర్ ప్రదేశ్ : ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిసినప్పటికీ కూడా నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. యదేచ్చగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయవతిల వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం... వారి ప్రచారానికి బ్రేక్ కూడా వేసింది. మరి ఇన్ని తెలిసీ కూడా కింది స్థాయి నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బుక్ అయ్యారు బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుగుతోంది. గురువారం ఓ సభను ఉద్దేశించి మాట్లాడిన రంజిత్ శ్రీవాస్తవ బీజేపీకి ఓటు వేయాలంటూ అక్కడి ప్రజలను అభ్యర్థించారు. మోడీని ప్రధానిగా చేసుకుంటేనే ముస్లింల ధైర్యాన్ని అణిచివేయొచ్చంటూ ప్రసంగించారు.
ముస్లింలు అధికారంలోకి రావాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారని అయితే వారు గెలవడం అసాధ్యమని జోస్యం చెప్పారు శ్రీవాస్తవ. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ బీజేపీకి ఓటు వేసి ముస్లింలు అధికారంలోకి రాకుండా చూడాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.