ఇసుక వ్యాపారం చేసిన ఇన్స్ పెక్టర్ సస్పెండ్
మైసూరు: అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని లారీని స్వాదీనం చేసుకుని అందులో ఉన్న ఇసుకను ప్రయివేటు వ్యక్తులకు అమ్మేసిన పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూరు నగరంలో జరిగిన ఈ విచిత్ర సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
బుధవారం మైసూరు నగర శివార్లలోని బిళికెరె పోలీసులు నాకాబంధి సాగించారు. ఆ సందర్బంలో అటు వైపు వెలుతున్న ఇసుక లారీని నిలిపారు. పర్మిట్ లేకుండ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని డ్రైవర్ యోగేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇసుక లారీని స్వాదీనం చేసుకుని డ్రైవర్ యోగేష్ మీద కేసు నమోదు చేసి అతనిని జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన యోగేష్ తన స్నేహితుల సహాయంతో తన లారీ మైసూరు నగరంలోని రామకృష్ణ నగరలో ఉందని తెలుసుకున్నాడు.
అక్కడికి వెళ్లి చూడగా ఖాళీ లారీ ఉందని, సమీపంలోని ఇంటి ముందు ఇసుక ఉందని యోగేష్ ఆరోపించాడు. బిళికెరె పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ పురుషోత్తం, కానిస్టేబుల్ భరత్ తన లారీ లోని రూ. 44,000 విలువైన ఇసుక విక్రయించారని ఆరోపించాడు.
మైసూరు నగరంలోని కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మైసూరు జిల్లా ఎస్పీ అభినవ్ కార్ ఇన్స్ పెక్టర్ పురుషోత్తం, కానిస్టేబుల్ భరత్ ను సస్పెండ్ చేశారు. దర్యాప్తు చెయ్యాలని కువెంపు నగర పోలీసులకు ఎస్పీ అభినవ్ కార్ ఆదేశాలు జారీ చేశారు.