రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ సహా ఐదుగురిపై కేసు: 420 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్, ఎందుకంటే..?
కరోనా వైరస్ నివారణ కోసం కరోనిల్ కనుక్కొన్నామని పతంజలి ప్రకటించిందో లేదో వివాదం మొదలైంది. ఆయుష్, లైసెన్స్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు.. పతంజలి, రాందేవ్ బాబాపై వ్యతిరేక స్వరం వినిపించారు. అయితే జైపూర్లో ఏకంగా కేసు నమోదవడం కలకలం రేపుతోంది. కరోనాను కరోనిల్తో నివారిస్తోందని ప్రజలను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేయడంతో... పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video
ఐదుగురిపై కేసు
కరోనా వైరస్ నివారణ కోసం కరోనిల్ పనిచేస్తుందని మంగళవారం పతంజలి డ్రగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జైపూర్ జ్యోతినగర్ పోలీసు స్టేషన్లో యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, శాస్త్రవేత్త అనురాగ్ వర్షిణీ, నిమ్స్ చైర్మన్ బల్బీర్ సింగ్ తోమర్, నిమ్స్ డైరెక్టర్ అనురాగ్ తోమర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
420 సెక్షన్ కింద..
రాందేవ్ బాబా సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశామని జ్యోతినగర్ పోలీసులు ధృవీకరించారు. కరోనిల్ వైరస్ను నాశనం చేస్తుందని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు వివరించారు. ప్రజలను మోసం చేసినందున 420 కింద కేసు పెట్టినట్టు బలరాం జాకర్ పేర్కొన్నారు. అయితే తాము అన్నీ అనుమతులు తీసుకొన్న తర్వాతనే రోగులపై కరోనిల్ ప్రయోగించామని బల్బీర్ సింగ్ పేర్కొన్నారు. ఐసీఎంఆర్ పరిధిలోని సీటీఆర్ఐ నుంచి పర్మిషన్ తీసుకున్నామని వివరించారు. దానికి సంబంధించి పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రోగులపై ప్రయోగించగా 100 మందిలో 69 శాతం మంది మూడురోజుల్లో కోలుకున్నారని.. 7 రోజుల్లో మొత్తం 100 శాతం మంది కోలుకున్నారని పేర్కొన్నారు.
విక్రయిస్తే అంతే...?
పతంజలి కరోనిల్ విక్రయించొద్దు అని, అలా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు అని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి శర్మ ఇదివరకే స్పష్టంచేశారు. దీనికి సంబంధించి కేంద్రం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, 1945 కింద ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గురించి ప్రస్తావించారు. అందులో ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా మందులు విక్రయించొద్దు అని స్పష్టంగా రాసి ఉందన్నారు.