‘ఫ్రీ కాశ్మీర్’: ముంబై యువతిపై కేసు నమోదు, వీడియోలో క్లారిటీ ఇచ్చిన మహెక్
ముంబై: సోమవారం గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ఆందోళనలో 'ఫ్రీ కాశ్మీర్' అంటూ ప్లకార్డు ప్రదర్శించిన ముంబైకి చెందిన స్టోరీ టెల్లర్ మహెక్ మీర్జా ప్రభుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్లకార్డు దేశానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
153బీ కింద కేసు నమోదు
మహెక్ మీర్జాపై కోలాబా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 153బీ కింద కేసు నమోదు చేసినట్లు ఇండియా టూడే ఆజ్తక్ తన కథనంలో వెల్లడించింది. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు మహెక్ మీర్జాపై ఐపీసీ సెక్షన్ 153బీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అవసరాన్ని బట్టి ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటామని చెప్పారు.
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు.. ప్లకార్డుపై బీజేపీ ఫైర్
సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో ఆధారాలు, వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.
సోమవారం సాయంత్రం గేట్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మహెక్ మీర్జా ఫ్రీ కాశ్మీర్ అని రాసివున్న ప్లకార్డును ప్రదర్శించారు. ఆమె ఆ పోస్టర్ను ప్రదర్శించడంపై బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
శివసేన మద్దతు.. వీడిమోలో క్లారిటీ ఇచ్చిన మహెక్..
కాగా, మహెక్ మీర్జాకు శివసేన నేతలు ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్ అనుకూలంగా మాట్లాడారు. జమ్మూకాశ్మీర్లో గత కొద్ది నెలలుగా ఇంటర్నెట్, మొబైల్ షట్ డౌన్ను నిరసిస్తూనే ఆమె ఆ ప్లకార్డును ప్రదర్శించారని అన్నారు. మహెక్ మీర్జా కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో ఇదే విషయం చెప్పడం గమనార్హం. జమ్మూకాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ సేవల నిలిపివేతపైనే తాను నిరసన వ్యక్తం చేశానని, తనకు వేరే ఉద్దేశం లేదని వీడియోలో ఆమె స్పష్టం చేశారు. కేసు నమోదు విషయంపై ఆమె ఇంకా స్పందించలేదు.