హత్రాస్ ఘటన... రాహుల్,ప్రియాంక సహా 153మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు...
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంకలతో సహా ఆ పార్టీకి చెందిన 153 మంది కార్యకర్తలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో అమల్లో ఉన్న ఎడిపెమిక్ డిసీజ్ యాక్ట్ని ఉల్లంఘించారన్న కారణంతో వారిపై గౌతమ బుద్ద నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భౌతిక దూరం,ఫేస్ మాస్కు నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో మరో 50 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Recommended Video
'దాదాపు 50 కార్లతో కూడిన కాంగ్రెస్ కాన్వాయ్ని ఢిల్లీ-నోయిడా హైవేపై అడ్డుకున్నాం. కరోనా నేపథ్యంలో గౌతమ బుద్ద నగర్ జిల్లాలో సీర్పీసీ సెక్షన్ 144 అమల్లో ఉండటంతో అక్కడికి వెళ్లవద్దని పలుమార్లు వారిని వారించాం. అయినప్పటికీ వాళ్లు మా మాటలను లెక్క చేయకుండా యమునా ఎక్స్ప్రెస్ వే వైపు బయలుదేరారు. ట్రాఫిక్ నిబంధనలను కూడా అతిక్రమించారు. ఈ క్రమంలో ఆ కాన్వాయ్లోని రెండు కార్లు యాక్సిడెంట్కి కూడా గురయ్యాయి....' అని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.
కాన్వాయ్ కారణంగా రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని... దీంతో కొన్ని అంబులెన్సులు కూడా అందులోనే చిక్కుకుపోయాయని పోలీసులు పేర్కొన్నారు. కాన్వాయ్ని అడ్డుకోవడంతో రాహుల్ కాలి నడకనే బయలుదేరారని... అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదన్నారు.
హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్,ప్రియాంక ఢిల్లీ నుంచి యూపీకి బయలుదేరిన క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్కు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తోపులాట జరగ్గా... రాహుల్ కింద పడిపోయారు. దీంతో పోలీసులు తనను పక్కకు నెట్టేసి లాఠీచార్జి చేశారని రాహుల్ ఆరోపించారు. ఈ దేశంలో నడిచేందుకు కూడా అవకాశం లేదా అని ప్రశ్నించారు. కేవలం ఆర్ఎస్ఎస్,బీజేపీ నేతలకే రోడ్డుపై నడిచే హక్కు ఉందా అని నిలదీశారు.
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.... ఉన్నావ్ అత్యాచార ఘటన లాగే హత్రాస్ బాధితురాలి కోసం కూడా న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని యోగి సర్కార్ ఇకనైనా మొద్దు నిద్ర వీడాలని ఫైర్ అయ్యారు.