బ్యాంకుకు కుచ్చుటోపి, బహుబాష నటి సింధు మీనన్ పై కేసు, అమెరికాకు జంప్, జైల్లో!
బెంగళూరు: ప్రముఖ బహుబాష నటి సింధు మీనన్ మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. విదేశాల్లో ఉన్న బహుబాష నటి సింధు మీనన్ ను విచారణకు హాజరుకావాలని బెంగళూరు నగర పోలీసులు నోటీసులు జారీ చేశారు. నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేసి రుణం తీసుకున్నారని తెలుగు, కన్నడ, తమిళ్, మళయాలం సినిమాల్లో నటించిన సింధు మీనన్ మీద చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడ
బెంగళూరులోని ఆర్ ఎంసీ యార్డు పోలీస్ స్టేషన్ లో బ్యాంకో ఆఫ్ బరోడ బ్రాంచ్ కార్యాలయం ఉంది. బహుబాష నటి సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ వర్మా నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకులో రూ. 30 లక్షలు రుణం తీసుకున్నారని బ్యాంకు మేనేజర్ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ సహాయం
బ్యాంక్ ఆఫ్ బరోడ బ్యాంకు మేనేజర్ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. బహుబాష నటి సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్, మరో మహిళ నాగశ్రీ శివన్నను పోలీసులు విచారణ చేశారు.
నకిలీ పత్రాలు
నటి సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తి కేయన్, నాగశ్రీ శివన్న, సుధా రాజశేఖర్ కలిసి నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకులో రూ. 30 లక్షలు రుణం తీసుకుని చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆర్ ఎంసీ యార్డు పోలీసులు గుర్తించారు.
సింధు మీనన్ సోదరుడు అరెస్టు
నటి సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ వర్మా, నాగశ్రీ శివన్న అనే మహిళను అరెస్టు చేశామని బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ శనివారం మీడియాకు చెప్పారు. సుధా రాజశేఖర్ కోసం గాలిస్తున్నామని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ అన్నారు.
అమెరికాలో సింధు మీనన్
నటి సింధు మీనన్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, చీటింగ్ కేసులో ఎఫ్ఐఆర్ లో మూడో స్థానంలో ఆమె పేరు ఉందని, విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశామని డీసీసీ చేతన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ఈ కేసులో సింధు మీనన్ కు ప్రమేయం ఉందని వెలుగు చూస్తే చీటింగ్ కేసులో ఆమెను అరెస్టు చేస్తామని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు.