ఛానెల్ ఉంది కదా అని అదుపు లేకుండా మాట్లాడితే ఖబడ్దార్: అర్నాబ్కు వార్నింగ్, ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై: ప్రముఖ జాతీయ ఛానెల్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై నాగ్పూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సామాజిక అసమానతను ప్రోత్సహించినందుకు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని పాల్ఘర్ సామూహిక దాడులకు ముడిపెట్టినందుకు అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముంబైకి చెందిన ముగ్గురు అందులో ఇద్దరు సాధువులు ఏప్రిల్ 16వ తేదీన సిల్వాసాకు వెళుతుండగా పాల్ఘర్ జిల్లా గదక్చించేల్ గ్రామం వద్ద మూకదాడి జరిగింది. ఆ ముగ్గురిని దొంగలుగా భావించి వారిపై దాడి చేయడం జరిగింది. అయితే ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా మార్చడం జరిగిందని సర్దార్ పోలీస్ స్టేషన్ కమిషనర్ బీకే ఉపాధ్యాయ.
Recommended Video
అర్నాబ్ గోస్వామి పై సెక్షన్ 117 కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వినిత సాహు చెప్పారు. కుట్రపన్నినట్లు ఆరోపిస్తూ సెక్షన్ 120(బీ) మతం పేరుతో రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారంటూ సెక్షన్ 153 (ఏ) కింద నమోదు అయ్యింది. దీంతో పాటు సెక్షన్ 295 (ఏ), 290 (ఏ), సెక్షన్ 500, మరియు 504 కింద కేసులు నమోదయ్యాయి. మరో ఎఫ్ఐఆర్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నమోదైంది.
పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఘటనపై అర్నాబ్ గోస్వామి తన ఛానెల్ ద్వారా తప్పుడు కథనాలను ప్రచురించారని మహారాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. ఆ ఘటనకు మతపరమైన రంగును పులిమి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న క్రమంలో కొన్ని మీడియా ఛానెళ్లు రాజకీయనాయకులు కలిసి దేశంలో సామరస్యం లేకుండా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో మహిళలను చులకన చేసే ప్రయత్నం అర్నాబ్ గోస్వామి చేశారని కాంగ్రెస్ మండిపడింది.
టీవీ చర్చలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గోస్వామిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిజం విలువలకు అర్నాబ్ గోస్వామి తిలోదకాలిచ్చేశారని మండిపడింది. దీనిపై బహిరంగ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. భారత్లో సోదరభావంతో మెలగాలనే సూత్రాన్ని తామంతా నమ్ముతామని చెప్పిన కాంగ్రెస్ అర్నాబ్ లాంటి కొందరు సమాజంలో విషప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. ఇది దేశ ఐక్యత సమగ్రతకు ప్రమాదంగా మారుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.