మాజీ ప్రధాని మనుమడి మీద హత్యాయత్నం కేసు, ఎఫ్ఐఆర్, డబ్బుల విషయంలో దాడి ?
బెంగళూరు: మాజీ ప్రధాని మనుమడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ కుమారుడు సూరజ్ రేవణ్ణ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. హాసన్ జిల్లా చెన్నరాయణ పట్టణ తాలుకా నంబిగాణహళ్ళిలో మంగళవారం రాత్రి బీజేపీ- జేడీఎస్ కార్యకర్తల పరస్పర దాడుల్లో అనేక మందికి తీవ్రగాయాలైనాయి. ఈ గొడవలకు సంబంధించి మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు సూరజ్, మరో ఆరు మంది మీద హత్యాయత్నం కేసు నమోదైయ్యింది.
మంగళవారం రాత్రి నంబిగానహళ్ళిలో ఓటర్లకు నగదు పంపిణి చేసే విషయంలో బీజేపీ- జేడీఎస్ కార్యకర్తల మద్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. నంబిగానహళ్ళిలోని ఫాం హౌస్ లో గొడవలు జరిగిన సమయంలో మాజీ ప్రధాని మనుమడు సూరజ్ రేవణ్ణ అక్కడే బయట కారు దగ్గర ఉన్నాడని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.
మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు సూరజ్ రేవణ్ణ రెచ్చగొట్టడం వలనే తమ మీద దాడులు జరిగాయని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా మీద దాడులు జరిగే సమయంలో సూరజ్ రేవణ్ణతో పాటు అనేక మంది జేడీఎస్ నాయకులు అక్కడే ఉన్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు దాడులు చెయ్యడంతో బెంగళూరు కార్పొరేటర్ (బీబీఎంపీ) ఆనంద్ హోసూరు, బెంగళూరులోని విజయనగర బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు నవీన్, కారు డ్రైవర్ ప్రవీణ్, స్థానిక నాయకుడు శివానందలకు తీవ్రగాయాలైనాయని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే కేఆర్ పేట ఉప ఎన్నికల సందర్బంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ స్వయంగా నిలబడి ఓటర్లకు డబ్బులు పంచిపెడుతున్నారని, అడ్డుకున్న జేడీఎస్ కార్యకర్తల మీద దాడులు చేశారని, దాడులు జరిగిన సమయంలో తన కుమారుడు సూరజ్ రేవణ్ణ అక్కడ లేకున్నా కేసులు పెట్టారని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ఆరోపించారు.