ఎన్నికల పోటీ నుంచి అజాంఖాన్ను బహిష్కరించాలి: జయప్రద
రాంపూర్: ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ సిట్టింగ్ ఎంపీ అజాంఖాన్ ఖాకీ అండర్వేర్ అంటూ జయప్రదను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలోనే అజాంఖాన్ వ్యాఖ్యలపై నటి మాజీ ఎంపీ జయప్రద స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని అజాంఖాన్ అసలు పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని జయప్రద డిమాండ్ చేశారు.
అజాంఖాన్ గెలిస్తే మహిళలకు భద్రత ఉండదు
సమాజ్వాదీ పార్టీ అజాంఖాన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని జయప్రద డిమాండ్ చేశారు. అజాంఖాన్ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందని వ్యాఖ్యానించారు. మహిళలకు సమాజంలో స్థానం ఉండదని ఆమె అన్నారు. అజాంఖాన్ లాంటి వారు ఉంటే సమాజం ఏమైపోతుందని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా ఎక్కడికి వెళ్లాలి.. నేను చనిపోవాలా అంటూ ఆవేదన చెందారు. నేను చనిపోతే అప్పటికైనా తృప్తి చెందుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జయప్రద. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాంపూర్ నుంచి పారిపోతాననుకున్నారా... ఆ సమస్యే లేదు అని జయప్రద అన్నారు.
2009లో కూడా అజాం ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు
ఇలాంటి వ్యాఖ్యలు తను కొత్తగా ఎదుర్కొనడం లేదని అన్నారు జయప్రద. 2009లో సమాజ్వాదీ పార్టీ నుంచి తాను ఎంపీగా బరిలో నిలిచిన సమయంలో కూడా తనపై అనుచిత వ్యాఖ్యలు అజాంఖాన్ చేశారని జయప్రద గుర్తుచేశారు. తను ముందుగా ఒక మహిళలనని అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను పలకాలంటేనే అసహ్యంగా ఉందన్నారు. అతనికి వ్యక్తిగతంగా ఎలాంటి హానీ తలపెట్టలేదని చెప్పిన జయప్రద తను మాత్రం ఎందుకు అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదని జయప్రద ధ్వజమెత్తారు.
అజాంఖాన్ అంటే అసహ్యం వేస్తోంది
ఒకప్పుడు అజాంఖాన్ తనకు సోదరుడితో సమానంగా ఉండేవారని కానీ ఇప్పుడు తనంటేనే అసహ్యం వేస్తోందని జయప్రద ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే అజాంఖాన్ వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పొరపాటున అజాంఖాన్ గెలిస్తే మహిళల భద్రతే ప్రశ్నార్థకంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలే తన భార్య, లేదా తల్లిపై చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు జయప్రద.