ఢిగ్గీ రాజా కోసం ప్రత్యేక పూజలు, హోమాలు, వివాదాస్పద కంప్యూర్ బాబా మీద ఎఫ్ఐఆర్ !
భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అలియా డిగ్గీ రాజా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు, హోమాలు, పూజలు నిర్వహించిన వివాదాస్పద బాబా కంప్యూటర్ బాబా అలియాస్ నామాదాస్ త్యాగి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దిగ్విజయ్ సింగ్ కు పోటీగా బీజేపీ నుంచి ప్రగ్యా సింగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఓడిపోవాలని, భారీ మెజారిటీతో దిగ్విజయ్ సింగ్ గెలవాలని కంప్యూటర్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు హోమాల కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో నాగసాధువులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కంప్యూర్ బాబా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్బంగా కంప్యూటర్ బాబా మీడియాతో మాట్లాడుతూ లోక్ పభ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్ భారీ మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేశామని అన్నారు.
సాధు సంతర వర్గానికి బీజేపి నమ్మించి తీరని అన్యాయం చేసిందని కంప్యూటర్ బాబా ఆరోపించారు. ప్రజలతో పాటు సాధువులను మోసం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని కంప్యూటర్ బాబా హెచ్చరించారు. అందు కోసం తామే స్వయంప్రేరితంగా దిగ్విజయ్ సింగ్ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేశామని కంప్యూటర్ బాబా వివరించారు.
రామ మందిరం లేదంటే మోడీ ప్రభుత్వం ఉండదనే విషయం బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని కంప్యూటర్ బాబా అన్నారు.మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అధికారంలో ఉన్న సమయంలో నర్మాదా నది కోసం ప్రత్యేక పథకాలు అమలు చేశారు.
ఆ సమయంలో కంప్యూటర్ బాబా కేబినేట్ ర్యాంక్ స్థానంలో మంచి పదవిలో ఉన్నారు. తరువాత కంప్యూటర్ బాబా కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా హోమాలు, ప్రచారం చేశారని ఆరోపిస్తూ కంప్యూటర్ బాబా మీద కేసు నమోదు చేసిన భోపాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.