సీఎంపై విమర్శలు, కేంద్ర మంత్రిపై కేసు నమోదు, బీజేపీ మీద కాంగ్రెస్ కక్ష!
బెంగూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మీద మైసూరులో కేసు నమోదు అయ్యింది. సీఎం సిద్దరామయ్య మీద అభ్యంతరకరంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే బెళగావి జిల్లాలోని కిత్తూరులో మాట్లాడుతూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మైసూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీజీ. విజయ్ కుమార్ మైసూరులోని జేఎంఎఫ్ సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విజయ్ కుమార్ పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మీద కేసు నమోదు చెయ్యాలని మైసూరులోని దేవరాజ్ అరసు పోలీస్ అధికారులకు సూచించింది. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే బెళగావి జిల్లాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, కేసు అక్కడికే బదిలీ చేస్తామని మైసూరు నగర సిటీ పోలీసు కమిషనర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వర్ రావ్ తెలిపారు.
2018లో కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ అండతో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు ధీమాతో ఉన్నారు. అయితే అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్జాగా ఉన్నారు.