హిందూ దేవుళ్లను కించపరిచేలా: మనోభావాలు దెబ్బతిన్నాయ్: ఆ వెబ్ సిరీస్పై ఎఫ్ఐఆర్
లక్నో: అమెజాన్ ప్రైమ్లో విడుదలైన వెబ్ సిరీస్ తాండవ్పై కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్ లక్నో పోలీసులు ఆ సిరీస్పై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం నోటీసులను జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలను సంధించిన నేపథ్యంలో ఈ సిరీస్ ప్రసారాన్ని నిలిపివేయాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు డిమాండ్ చేశారు.
బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరించడం, దాన్ని యధాతథంగా ఓటీటీలో ప్రదర్శించడంపై వివరణ ఇవ్వాలని అమెజాన్ ప్రైమ్ను కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ కోరిన కొన్ని గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. అమెజాన్ ప్రైమ్ ఇండియా ఒరిజినల్ కంటెంట్ హెడ్, అపర్ణ పురోహిత్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహతా, రైటర్ గౌరవ్ సోలంకి, మరి కొందరు చిత్రం యూనిట్ సభ్యుల పేర్లను ఇందులో చేర్చారు.
తాండవ్ వెబ్ సిరీస్కు వ్యతిరేకంగా మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెబ్ సిరీస్ క్రియేటర్లు, నటులు, డైరెక్టర్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచారంటూ విమర్శించారు. బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్.. తాండవ్ అంశాన్ని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఓటీటీలో వెబ్ సిరీస్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్న నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ జోక్యం చేసుకున్నారు. వివరణ ఇవ్వాలంటూ అమెజాన్ ప్రైమ్కు నోటీసులను జారీ చేశారు. ఆ వెంటనే తాండవ్ టీమ్పై లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది.