ఢిల్లీ పోలీసుల మెడకు: జామియా వర్శిటీ విద్యార్థినులను లైంగికంగా: ప్రైవసీకి దెబ్బ: వైస్ ఛాన్సలర్ ఫైర్.
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు.. ఢిల్లీ పోలీసుల మెడకు చుట్టుకుంటున్నాయి. జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం, వారిపై లాఠీ ఛార్జీ చేయడం పట్ల వర్శిటీ అధికారుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ పోలీసులపై వెంటనే ఎఫ్ఐఆర్ ను నమోదు చేయనున్నట్లు అధికారులు నిర్ణయించుకున్నారు.
క్యాంపస్ లో ప్రవేశించి..
న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిన విధ్వంసక పరిస్థితులకు జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులే కారణమని పోలీసులు భావించారు. ఎలాంటి అనుమతులు లేకుండా యూనివర్శిటీ క్యాంపస్ లోకి ప్రవేశించారు. హాస్టళ్లలో దూరి మరీ సుమారు 80 మంది జామియా వర్శిటీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. లాఠీ ఛార్జీ చేశారు.
రాత్రంతా నిర్బంధంలో..
హింసాత్మక పరిస్థితులకు తాము కారణం కాదని, విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు ఈ ఉద్రిక్తతలకు కారణమై ఉంటారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు వినిపించుకోలేదు. సోమవారం తెల్లవారు జామున వారిని విడిచి పెట్టారు. క్యాంపస్ లో అక్రమంగా ప్రవేశించడం, అధికారుల అనుమతి తీసుకోకుండా పెద్ద సంఖ్యలో విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకోవడం వంటి చర్యల పట్ల యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసు పెడతాం..
క్యాంపస్ లోకి ప్రవేశించిన పోలీసులపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకూ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ఏ హక్కుతో వారు క్యాంపస్ లో అడుగు పెట్టారని నిలదీశారు. ఢిల్లీ పోలీసులు యూనివర్శిటీ ఆస్తులను సైతం ధ్వంసం చేశారని, దీనికి నష్ట పరిహారాన్ని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఆదివారం చోటు చేసుకున్న సంఘటనలు దురదృష్టకరమైనవని అన్నారు.
ఉన్నత స్థాయి విచారణ..
జామియా యూనివర్శిటీ క్యాంపస్ లో పోలీసుల ప్రవేశించడంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని నజ్మా అఖ్తర్ తెలిపారు. యూనివర్శిటీ తరఫున ఈ ఉన్నత స్థాయి కమిటీ విచారణ కొనసాగుతుందని, ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, క్యాంపస్ లోకి ప్రవేశించిన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకూ తాము వెనుదిరగబోమని అన్నారు. యూనివర్శిటీ ఆవరణలో పోలీసులు ప్రవేశించిన అనంతరం కొంతమంది విద్యార్థినులపై లైంగికంగా వేధించారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ కోణంలో విచారణ చేపడతామని రిజిస్ట్రార్ ఏపీ సిద్ధిఖీ తెలిపారు.