కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. సీఎం టెంట్లు అహూతి: మౌని అమావాస్యకు మరుసటి రోజే
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో వైభవంగా కొనసాగుతున్న అర్ధ కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రాథమికంగా అందిన సమాచారం. లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ ను సందర్శించి పవిత్ర స్నానాలు ఆచరించిన మౌని అమావాస్యకు మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి తెస్తున్నారు. ఆరు అగ్నిమాపక బృందాలు మంటలను నియంత్రించడానికి శ్రమిస్తున్నారు. కుంభమేళా ఆరంభానికి ఒకరోజు ముందు కూడా నాగా సాధువులు నివసించే అఖాడాలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
తాజాగా సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల కొన్ని టెంట్లు అహూతి అయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శన సందర్భంగా కుంభమేళా సమీపంలోని ఓల్డ్ జీటీ రోడ్ లో తాత్కాలికంగా వేసిన మహారాజా టెంట్లు దగ్ధం అయ్యాయి. వాటితో పాటు వీఐపీల కోసం విలాసవంతంగా ఏర్పాటు చేసిన టెంట్లు కూడా మంటల బారిన పడ్డాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే కుంభమేళాలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సేద తీరడానికి అధికారులు ఈ మహారాజా టెంట్లను ఏర్పాటు చేశారు.
కాగా, కుంభమేళాలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కుంభమేళాలో మంటలు చెలరేగడం ఇది తొలిసారి కాదు. కిందటి నెల 19వ తేదీన సెక్టార్ 13లోని ప్రయాగ్ వాల్ సభ సమీపంలో వేసిన టెంట్లల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదే నెల 16వ తేదీన కూడా ఇలాంటి ఘటనే నమోదైంది. స్వామి వాసుదేవానంద శిబిరంలో మంటలు అంటుకున్నాయి. శిబిరంలో వంట వండుతున్న సమయంలో మంటలు చెలరేగి పలు టెంట్లు కాలి బూడిదయ్యాయి. అలాగే- 14వ తేదీన నాగాసాధవుల కోసం ఏర్పాటు చేసిన దిగంబర అఖాడాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
వంట వండటానికి తీసుకొచ్చిన సిలిండర్ లీక్ కావడం వల్ల అఖాడాలో మంటలు చెలరేగాయి. ఇప్పటిదాకా నమోదైన ప్రమాదాల్లో ఇదే తీవ్రమైనది. సిలిండర్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగాయి. స్వల్పంగా పేలుడు కూడా సంభవించింది. దీనివల్ల పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. తెల్లవారితే కుంభమేళా ఆరంభం అవుతుందనగా దిగంబర అఖాడాలో జరిగిన ప్రమాదంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. రక్షణ చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. తాజాగా మరోసారి మంటలు అంటుకోవడం అనేక అనుమానాలకు తెర తీసింది.