సీరం సంస్థలో అగ్ని ప్రమాదం .. కోవిషీల్డ్ వ్యాక్సిన్ స్టాక్ సేఫ్ .. ప్రాణాలు కాపాడటమే ముఖ్యమన్న సీరం సిఈవో
పూణేలోని కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూణేలోని మంజరీ ప్రాంతంలో గల సీరం ప్రాంగణంలో నిర్మాణ దశలో ఉన్న సెజ్ 3 భవనంలో నాలుగు, ఐదు అంతస్తులలో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పది అగ్నిమాపక కేంద్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది.
కోవిషీల్డ్ ఫస్ట్ బ్యాచ్ రవాణాపై సీరం సిఈవో భావోద్వేగం .. ఇండియాలో 13 ప్రాంతాలకు చేరిన వ్యాక్సిన్
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ .. స్పందించిన సీరం సిఈవో
ప్రాథమిక సమాచారం ప్రకారం భవనంలో ఉన్నవారిని భవనం నుండి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటివరకు భవనం లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై స్పందించిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనవల్లా ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేకుండా ఉండడమే తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. మంటలు చెలరేగిన భవనం లోపల ఇరుక్కున్న వ్యక్తులను రక్షించడంపై తాము ప్రస్తుతం దృష్టి సారించామని చెప్పారు.
కోవిడ్ -19 వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' స్టాక్ సురక్షితం
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేసింది. భారతదేశంలో అత్యవసర వినియోగ అనుమతి పొందిన రెండు కోవిడ్ -19 వ్యాక్సిన్లలో కోవిషీల్డ్ ఒకటి. అయితే, మంటలు చెలరేగిన భవనం కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీకి లేదా నిల్వ చేయడానికి ఉపయోగించబడలేదని వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' స్టాక్ సురక్షితంగా ఉందని పేర్కొన్నారు .
అగ్ని ప్రమాదానికి గురైన భవనం నిర్మాణంలో ఉన్న భవనం
ఇప్పటివరకు ఈ అగ్ని ప్రమాదం నుండి తొమ్మిది మందిని రక్షించారు. ఈరోజు జరిగిన అగ్ని ప్రమాద ఘటన కోవిషీల్డ్ వ్యాక్సిన్ల తయారీపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొన్నారు. ప్రభావిత భవనం 100 ఎకరాల ప్రాంగణంలో ప్రధాన ద్వారం దగ్గర నిర్మాణంలో ఉన్న యూనిట్ అని తెలిపారు. ప్రస్తుతం 10 ఫైరింజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి . భవనం లోపల ఇరుక్కున్న నలుగురిలో ముగ్గురిని రక్షించినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్ రాన్పైస్ తెలిపారు.
నష్టం అంచనా తర్వాత .. ఫస్ట్ సిబ్బంది ప్రాణాలు అన్న అదర్ పూనవల్లా
అగ్నిప్రమాదం తరువాత తన మొదటి ప్రతిచర్యలో, పూనవల్లా అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనంలో చిక్కుకున్న వారిని రక్షించడంపై మాత్రమే దృష్టి పెట్టానని చెప్పాడు. మేము మొదట మా సిబ్బందిని కాపాడటానికి చూస్తున్నామని , ఆ తర్వాతే తాము నష్టాన్ని అంచనా వేస్తాము, అని , ఘటనకు గల కారణాలను అన్వేషిస్తామని ఆయన స్పష్టం చేశారు.