బెంగళూరు ఎయిర్ షో పార్కింగ్ లో అగ్నిప్రమాదం .. పదుల సంఖ్యలో కాలిబూడిదైన కార్లు ( వీడియో)
బెంగళూరు : బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ మహిళల స్కై డైవింగ్ జరుగుతోన్న చోట అగ్నిప్రమాదం జరిగింది. కారు పార్కింగ్ వద్ద మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 300 కార్లు కాలిబూడిదయ్యాయి. పార్కింగ్ ప్రదేశంలో ఎండిన గడ్డి ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న కార్లకు అంటుకోవడంతో అవి కాలిపోయాయి. గత వారం బెంగళూరు ఎయిర్ షోలో సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో ఢీకొని ఫైలట్ మృతిచెందిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
300 కార్లు దగ్ధం
ఓ వైపు మహిళల స్కై డైవింగ్ ఉత్సాహంగా సాగుతోండగా మరోవైపు కారు పార్కింగ్ చేసిన చోట అగ్నిప్రమాదం జరిగింది. గేటు నంబర్ 5 వద్ద గల వాహన పార్కింగ్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అయితే పక్కనే ఉన్న గడ్డికి మంటలు అంటుకున్నాయి. అవి వ్యాపించి కార్లకు వ్యాపించడంతో అవి కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 300 కార్లు దగ్ధమైనట్టు స్థానిక అధికారులు చెప్తున్నారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పార్కింగ్ ప్లేస్ కు సమీపంలో కొన్ని విమానాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఎవరికీ గాయాలు కాలేదు
సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. అయితే దగ్గర దగ్గర కార్లు ఉండటంతో మంటలు ఆర్పివేయడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని కర్ణాటక అగ్నిమాపక అధికారులు తెలిపారు.
కారు నుంచి వ్యాపించిన మంటలు ? ..
పార్క్ చేసిన ఓ కారుల్లోంచి మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఆ మంటలు అక్కడే ఉన్న గడ్డికి అంటుకొని వేగంగా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పార్క్ చేసిన చివరి కారు నుంచి తొలుత మంటలు వచ్చినట్టు తెలిపారు.
కొద్దిసేపు ముందు తేజస్ లో సింధు
ఈ ప్రమాదానికి కొద్ది సేపు ముందు .. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు .. తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. మహిళల దినోత్సవం సందర్భంగా ఏవియేషన్ అధికారులు సింధుకు అవకాశం కల్పించారు.
గగనతలంలో ఫ్లైట ఢీ .. ఒకరి మృతి
గతవారం బెంగళూరు ఎయిర్ ఇండియా షోలో ప్రమాదం జరిగింది. గగనతంలో రెండు సూర్యకిరణ్ విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ పైలట్ కూడా మృతిచెందాడు. మరో పైలట్ గాయపడ్డారు.