ముంబైలో మరో అగ్ని ప్రమాదం...పరేల్ ప్రాంతంలోని భవంతిలో చెలరేగిన మంటలు
Recommended Video
ముంబై: ముంబై మహానగరంలో ఓ నివాస ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యంత రద్దీగా ఉన్న పరేల్ ప్రాంతంలోని క్రిస్టల్ టవర్లో ఈ ప్రమాదం జరిగింది. ఆ భవంతిలో చాలామంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నివాస భవంతి హింద్ మాతా సినిమా హాల్ ఉన్న చోట ఉంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆప్రాంతాన్ని అలుముకుంది. ఈ అగ్ని ప్రమాదం స్థాయిని లెవెల్-2గా అంచనా వేశారు అధికారులు.
మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. భవంతి 12వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బందికి బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చిందని అధికారులు తెలిపారు. మంటలు చిన్నగా వ్యాప్తి చెందడంతో దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. భారీ క్రెయిన్ల సహాయంతో మంటల్లో చిక్కుకున్నవారిని ఫైర్ సిబ్బంది కాపాడు ప్రయత్నం చేస్తోంది. వారిని క్రెయిన్ ద్వారా కిందకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఫైర్ సిబ్బంది.
ఇప్పటి వరకు ఎనిమిది మందిని ఫైర్ సిబ్బంది కాపాడగలిగింది. వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. హెల్త్ చెకప్కు వారిని వెంటనే హాస్పిటల్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. బిల్డింగ్ను మొత్తం పొగ కమ్మేసిందని, అపార్ట్మెంట్లో ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కిటికి దగ్గరకు పరిగెత్తామని 16వ అంతస్తులో ఉండే పదేళ్ల కుర్రాడు జెన్ సదావర్కర్ చెప్పాడు. మంటలు 12వ అంతస్తునుంచి పైకి పాకుతుండటంతో తాము కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశామని చెప్పాడు. అయితే క్రెయిన్ సహాయంతో కిందకు దిగామని జెన్ చెప్పాడు.
ఆగష్టు 13న కూడా లెవెల్ -2 స్థాయి అగ్ని ప్రమాదం పరేల్ ప్రాంతంలోని ఓ గోడౌన్లో సంభవించింది. 12 ఫైర్ ఇంజిన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గతేడాది డిసెంబరులో కమలా మిల్స్ కాంపౌండ్లోని పబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.