కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: ఎనిమిది మంది సజీవ దహనం: 40 మందికి పైగా తరలింపు
అహ్మదాబాద్: కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం చికిత్స అందించడానికి గుర్తించిన ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పేషెంట్లు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో అయిదుమంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
Recommended Video
ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తి: అనూహ్య మార్పు: కాశ్మీర్ కొత్త గవర్నర్గా కేంద్ర మాజీమంత్రి
అహ్మదాబాద్ నవరంగ్పూర్ ప్రాంతంలోని శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సంభవించిన వెంటనే మిగిలిన పేషెంట్లను సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటిదాకా సుమారు 40 మంది పేషెంట్లను సహాయక సిబ్బంది రక్షించారు. వారిని సర్దార్ పటేల్ ఆషుపత్రికి తరలించారు.
మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. వారు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలియరావాల్సి ఉంది. కరోనా వైరస్ బారిన పడిన వారు కొద్దిరోజుల కిందటే శ్రేయ్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో చెలరేగిన మంటలు క్రమంగా మిగిలిన వార్డులకు వ్యాప్తి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
15 అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మిగిలిన పేషెంట్లను సర్దార్ పటేల్ ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్ బీ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎల్బీ జలా స్వయంగా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటిదాకా 40 మంది పేషెంట్లను వేరే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అగ్నిప్రమాదం చెలరేగడానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఎనిమిది మంది మరణించారని నిర్ధారించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టమ్ కోసం తరలించినట్లు చెప్పారు.