కేరళ సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం.... ఆ ఆధారాలను మాయం చేసే కుట్ర...?
తిరువనంతపురంలోని కేరళ సచివాలయంలో మంగళవారం(అగస్టు 25) అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని నార్త్ బ్లాక్లో ఉన్న ప్రోటోకాల్ సెక్షన్ డిపార్ట్మెంట్లో సాయంత్రం 4.45గం. సమయంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్,రెస్క్యూ టీమ్స్ స్పందించడంతో మంటలను త్వరగానే అదుపు చేయగలిగారు.
ప్రమాదంలో పలు డాక్యుమెంట్స్,ఫైళ్లు,కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడ్డ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు సెక్రటేరియట్లోని అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఎంఎస్ హరికృష్ణన్కు నోటీసులు ఇచ్చిన మరుసటిరోజే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా ప్రమాద ఘటనపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను మాయం చేసే కుట్రలో భాగంగానే అగ్నిప్రమాదం జరిగిందని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ కూడా ఇవే ఆరోపణలు చేశారు.
'గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన అత్యంత కీలక ఫైళ్లు అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. బ్యాకప్ ఫైల్స్ ఏవీ అందుబాటులో లేవు. ఈ ప్రమాదాన్ని కచ్చితంగా అనుమానించాల్సిందే. ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనికి బాధ్యత వహించాలి.' అని రమేష్ చెన్నితల పేర్కొన్నారు. ఈ ఘటనపై గవర్నర్ను కలుస్తామని చెప్పారు.
అగ్ని ప్రమాద ఘటన గురించి తెలియగానే బీజేపీ,కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ ఎదుట నిరసనకు దిగారు. తమను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆధారాలను మాయం చేసేందుకు పన్నిన కుట్ర ఇది అని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మీడియా ప్రతినిధులను కూడా అక్కడినుంచి ఖాళీ చేయించారు. ఈ క్రమంలో కొంతమంది జర్నలిస్టులపై పోలీసులు చేయి కూడా చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సెక్రటేరియట్ హౌజ్కీపింగ్ అడిషనల్ సెక్రటరీ పి.హానీ అగ్ని ప్రమాద ఘటనపై మాట్లాడుతూ... కంప్యూటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కీలక ఫైల్స్ ఏవీ దగ్ధం కాలేదని,అన్నీ భద్రంగానే ఉన్నాయని చెప్పారు. ప్రమాద సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారని.. మిగతావారు కోవిడ్ 19 కారణంగా ఇప్పటికే క్వారెంటైన్లో ఉన్నారని స్పష్టం చేశారు.