ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం... మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు...
దేశ రాజధాని ఢిల్లీలోని గాంధీనగర్లో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో గురువారం(నవంబర్ 12) రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగి... క్షణాల్లో భవనమంతా వ్యాపించాయి. ప్రస్తుతం 26 ఫైరింజన్లు అక్కడ మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అగ్నిమాక సిబ్బంది ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.... రాత్రి 8.40గం. సమయంలో అగ్నిప్రమాదంపై తమకు సమాచారం అందిందన్నారు. ఆ వెంటనే హుటాహుటిన 26 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చునని బావిస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో గత కొద్ది నెలలుగా వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కర్కర్ డూమాలోని ఆదిత్య మాల్లో మంటలు చెలరేగి తీవ్రనష్టం సంభవించింది. అంతకుముందు,షాజదాబాద్ బాగ్ ప్రాంతంలోని ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే ఏడాది జూన్లో ఢిల్లీలోని తుగ్లాకాబాద్లో ఉన్న మురికివాడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగి దాదాపు 200 గుడిసెలు కాలిబూడిదయ్యాయి.