పార్లమెంటులో అగ్నిప్రమాదం... మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
ఢిల్లీ: ఢిల్లీలో తరుచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం పార్లమెంటు భవనంలోని 6వ అంతస్తులో సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ వెంటనే అక్కడకు చేరుకుని ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది. అయితే అగ్ని ప్రమాదంకు కారణం షార్ట్సర్క్యూట్ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉదయం 7:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ఘటనా స్థలంకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఉదయం ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదే సమయంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. ప్రజల దేవాలయంగా పిలువబడే పార్లమెంటులో దేశ చట్టాలను రూపొందిస్తారు. అలాంటి భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పలువురిని ఆందోళనకు గురిచేసింది.
ఇదిలా ఉంటే రాజ్యసభ లోక్సభ సమావేశాలు కరోనావైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి రద్దయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు పార్లమెంటు సమావేశాలు రద్దయ్యాయి. మార్చి 23న బడ్జెట్ సమావేశాలు వాయిదాపడ్డాయి. ఇదిలా ఉంటే వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని అధికారులు ఆదివారం వివరించారు.చాంబర్ల దగ్గర నుంచి గ్యాలరీల వరకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే సెప్టెంబర్ 23 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే ఒక సమావేశానికి మరో సమావేశానికి ఆరునెలల కంటే ఎక్కువ సమయం గ్యాప్ ఉండరాదు. ఇదిలా ఉంటే ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#UPDATE Delhi: The fire that broke out on the 6th floor of the Parliament Annexe Building, has been brought under control. 7 fire tenders were engaged in the fire fighting operation. https://t.co/8b0t2sce4M
— ANI (@ANI) August 17, 2020