ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం, భవనాలకు వ్యాపించిన మంటలు, రంగంలోకి 20 ఫైరింజన్లు..
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం జరిగింది. గత ఆదివారం అనాజ్ మండీలో గల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 43 మంది చనిపోయిన ఘటన మరవకముందే మరో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. పశ్చిమ ఢిల్లీలో గల ముకుందా ప్రాంతంలో గల ప్లైవుడ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
ఎదురుగా ఉన్న బల్బుల ఫ్యాక్టరీలోకి కూడా మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాదంలో ఆస్తినష్టంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రాణ నష్టం కూడా జరగలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
అనాజ్ మండీ ప్రమాదం తర్వాత విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. ఫ్యాక్టరీకి లైసెన్స్ లేదని తెలిసింది. అంతేకాదు మైనర్లను కూలీ పనిలో పెట్టుకొని.. 16 గంటలు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని తెలిసింది. కానీ వారికి ఇచ్చేది రూ.2 వేల జీతమేనని సమాచారం.