50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తే ఇకపై అదనపు ఛార్జీలు ఉండవు: కేంద్రం
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 50 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేస్తే అలాంటి కస్టమర్లకు అదనపు ఛార్జీలు వర్తించవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు ఒక ఖాతా నుంచి ఏడాదికి కోటి రూపాయలు విత్డ్రా చేస్తే అలాంటి వారిపై 2శాతం టీడీఎస్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఇది కేవలం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకే తీసుకుంటున్న నిర్ణయం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఈ లావాదేవీలన్నిటినీ రిజర్వ్ బ్యాంక్ ఇతర బ్యాంకులు పర్యవేక్షిస్తాయని సీతారామన్ చెప్పారు. ఇక డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆదాయపు పన్నుశాఖ చట్టంలో పలు సవరణలు చేయనుంది. ఇక ఇప్పటిరే భీమ్, యూపీఐ, యూపీఐ-క్యూఆర్ కోడ్, ఆధార్ పే, పలు డెబిట్ కార్డులు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా పేమెంట్లు చెల్లించే అవకాశం ఉందని వివరించారు.
ఇక డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని గుర్తుచేశారు నిర్మలా సీతారామన్. ఇక అదే సమయంలో నగదు రహిత చెల్లింపులను ప్రమోట్ చేసేందుకు కోటి రూపాయల వరకు డబ్బులు విత్డ్రా చేసుకుంటే 2శాతం టీడీఎస్ విధించడం జరుగుతుందని ఆమె చెప్పారు.