వ్యక్తిగత ఖాతాల్లోకి రూ.2వేల కోట్లు బదిలీ..PMC బ్యాంకు స్కామ్లో తొలి అరెస్టులు
ముంబై: పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ)లో కొద్దిరోజుల క్రితం భారీ స్కామ్ బయటపడిన విషయం తెలిసిందే. లోన్ల పేరుతో బ్యాంకు అధికారులు హెడిఐఎల్ కంపెనీ అధికారులతో కుమ్మక్కయ్యారని కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా డబ్బులు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఆర్బీఐ అడ్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. తాజాగా పోలీసుల విచారణలో మరో విషయం వెలుగు చూసింది.
వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ అయిన డబ్బులు
పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు స్కామ్లో ఇంటివారే దొంగలయ్యారు. హెచ్డీఐఎల్ కంపెనీ అధికారులకు లోన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పి సంస్థ ఖాతాలోకి కాకుండా నేరుగా ఆ అధికారుల వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులను బదిలీ చేసినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. రూ.2వేల కోట్లు మేరా హెచ్డీఎల్ బాసుల పర్సనల్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తొలి అరెస్టులు గురువారం జరిగాయి. హెచ్డీఎల్ఐ సంస్థ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వధావన్ మరియు సారంగ్ వధావన్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
44 రహస్య ఖాతాలు సృష్టించిన హెచ్డీఐఎల్ బాసులు
అంతకుముందు ముంబై ఆర్థిక విభాగం పీఎంసీ బ్యాంకు అధికారులు, వధావన్లపై చీటింగ్, ఫోర్జరీ ఇతర సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఇదిలా ఉంటే వధావన్లకు గురువారం సిట్ సమన్లు జారీ చేసింది. ముందుగా వారిని ప్రశ్నించిన సిట్ అధికారులు విచారణకు హెచ్డీఐఎల్ బాసులు సహకరించకపోవడంతో ఇద్దరిని అరెస్టు చేసింది. వీరిద్దరూ కలిసి 44 రహస్య ఖాతాలను సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి పాస్వర్డ్లు పెట్టడంతో ఆర్బీఐ ఆడిటింగ్ చేసిన సమయంలో ఈ ఖాతాలు కనిపించేవి కాదని పోలీసులు వెల్లడించారు.
లోన్లు మంజూరు చేసినందుకు ఛైర్మెన్కు రూ. 100 కోట్లు
పీఎంసీ నుంచి వచ్చిన రుణాలు ఈ రహస్య ఖాతాలోకి చేరేవని అయితే వీటికి సంబంధించిన విషయాలు కనిపించేవి కాకపోవడంతో ఇలా కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పీఎంసీ అధికారులు బ్యాంకు సాఫ్ట్వేర్ను ట్యాంపర్ చేశారని అందుకే 44 అకౌంట్లకు సంబంధించిన సమాచారం ప్రత్యక్ష్యం కావడం లేదని వెల్లడించారు. ఇక పీఎంసీ ఛైర్మెన్కు డీమ్యాట్ అకౌంట్ ఉందని దాని షేరు విలువ రూ.100 కోట్లుగా గుర్తించామని డీసీపీ ప్రణయ్ అశోక్ తెలిపారు. పీఎంసీ బ్యాంకు ఛైర్మెన్ హోదాలో వార్యం సింగ్ హెచ్డీఐఎల్ సంస్థకు రుణాలు ఇవ్వడంతో వారు తిరిగి రూ. 100 కోట్లు చెల్లించినట్లు, ఆ డబ్బులే డీమ్యాట్ అకౌంట్తో ఉన్న షేర్లుగా గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు.