కరోనా విజృంభన వేళ - మరో ఫంగస్ కలకలం : థర్డ్ వేవ్ లో తొలి కేసు గుర్తింపు - అలర్ట్ అవ్వాల్సిందే..!!
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే 29 రాష్ట్రాల్లో గుర్తించారు. రెండు లక్షలకు పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ప్రతీ రోజు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో..తిరిగి అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇక, ఈ సమయంలోనే గతేడాది సెకండ్ వేవ్లో వణుకుపుట్టించిన బ్లాక్ ఫంగస్ మళ్ళీ పంజా విసిరడం ప్రారంభించింది.
Recommended Video
మరోసారి వెలుగులోకి బ్లాక్ ఫంగస్
ప్రస్తుతం మూడో వేవ్లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్ ఫంగస్ అతని కన్ను, ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. గతంలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు బయట పడ్డాయి. ఈ ఫంగస్ కారణంగా అనేక మంది కంటి చూపు సైతం కోల్పోయారు. అయితే, ఇప్పుడు తిరిగి అదే ఫంగస్ గుర్తించటంతో ఆందోళన మొదలైంది.
కరోనా - షుగర్ బాధితులపై ప్రభావం
ప్రధానంగా షుగర్ బాధితులు చెక్కెర శాతం పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. కంట్లో నొప్పిగా ఉందని వచ్చిన ఆ వ్యక్తిలో పరీక్షలు చేయగా తొలుత కరోనా సోకినట్లుగా గుర్తించారు.
ఆ తరువాత బ్లాక్ ఫంగస్ సోకినట్లుగా నిర్దారణ అయింది. అయితే, బ్లాక్ ఫంగస్ కు గురైన వ్యక్తికి డయాబెటీస్ కారణంగానే ఈ ఫంగస్ సోకినట్లు వైద్యులు తేల్చారు. బ్లాక్ ఫంగస్ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు కాన్పూర్ జీఎస్వీఎమ్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కలా తెలిపారు. ఇతను కాన్పూర్ లోని కాంట్ నివాసి అని తెలిపారు.
సెకండ్ వేవ్ లో తీవ్ర స్థాయిలో..ఇప్పుడు
సదరు వ్యక్తికి కరోనా సోకిందని.. ఆతర్వాత బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అతని మధుమేహం సమస్య ఉందని తెలిపారు. ప్రస్తుతం అతని చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి అప్పట్లో ఔషధాల పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది.
ఇక, ఇప్పుడు కేసులు వెలుగులోకి వచ్చినా.. షుగర్ నియంత్రణ.. వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి.. బూస్టర్ డోసు పొందుతున్న దీర్ఘకాలకి వ్యాధి గ్రస్తులకు సమస్య తీవ్రత తక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, కేసులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ముందస్తు చర్యలు తప్పవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.