బీహార్ కేబినెట్ తొలిసారి భేటీ- ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాలకు నిర్ణయం
హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపుమీదున్న నితీశ్ కుమార్ నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఇవాళ కేబినెట్ భేటీ నిర్వహించారు. ఇందులో త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 23 నుంచి 27 వరకూ ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు.
సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఇవాళ సమావేశమైన బీహార్ కేబినెట్ ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సాగే గవర్నర్ ప్రసంగం ముసాయిదాను ఆమోదించే అధికారాన్ని సీఎంకు కట్టబెడుతూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 23న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే తాజాగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు శాసనసభ స్పీకర్ను కూడా ఎన్నుకుంటారు. హెచ్ఏఎమ్ నేత జీతన్రామ్ మాంఝీని స్పీకర్ చేయాలని ఇప్పటికే అధికార ఎన్డీయే కూటమి నిర్ణయించింది.
బీహార్ ఎన్నికల్లో విజేతగా నిలిచిన ఎన్డీయే కూటమి.. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్ఏఎం, వీఐపీ నుంచి ఒక్కొక్కరు చొప్పిన కేబినెట్ మంత్రులయ్యారు.
Recommended Video
బీజేపీకి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణూదేవీని నితీశ్ ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నితీశ్ కేబినెట్ను విస్తరించే అవకాశముంది. రికార్డు స్ధాయిలో నితీశ్ కుమార్ ఏడోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన పాలన ఈసారి ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.