అసలు నిజం కక్కేసిన అమిత్, మమత -‘దీదీ అల్లుడి అవినీతి గిల్లుడు’ -‘షా కొడుక్కి అర్హత ఉందా?’
నోరేసుకు పడిపోయే ఇద్దరు నేతలు.. ఒకే సమయంలో ఒకే చోటికి చేరితే.. పరస్పర ఆరోపణలు, విమర్శలకు తక్కువేముంటుంది? అయితే, ఆ తిట్ల దండకంలో కొన్ని సార్లు పచ్చి నిజాలు వెల్లడవుతుంటాయి. అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్లో ఇవాళ అదే దృశ్యం చోటుచేసుకుంది. సీఎం మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇద్దరూ గురువారం సౌత్ 24 పరగణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకునే క్రమంలో.. రాజకీయ వారసత్వపు పోకడలను బయటపెట్టేశారిలా..
బీజేపీని దెబ్బతీసేలా బెంగాల్కు రైతు ఉద్యమం -టికాయత్ వార్నింగ్ -పెట్రోల్ పెంపు, పంటలకు ధర ఇవ్వరా?
మమత అల్లుడు అవినీతిపరుడు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సౌత్ 24 పరగణ జిల్లాలో బీజేపీ గురువారం నిర్వహించిన ఐదో దశ పరివర్తన్ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికారం కోసమే తాము పోరాడటంలేదని, బంగారు బెంగాల్ కోసమైనా బీజేపీని గెలిపించాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ, మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతపై విమర్శలు గుప్పిస్తూ.. ''ప్రస్తుతం బెంగాల్ లో ఎక్కడ విన్నా 'దీదీ-భాయిపో(అల్లుడు)' గురించే చర్చించుకుంటున్నారు. అత్త(మమత) అధికారాన్ని అడ్డం పెట్టుకుని అల్లుడు అభిషేక్ బెనర్జీ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నట్లు జనం చెబుతున్నారు. వాళ్ల బారి నుంచి బెంగాల్ ను కాపాడటానకే బీజేపీ వచ్చింది. అసలు బీజేపీ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ లేకపోతే బెంగాల్ ఏనాడో బంగ్లాదేశ్ లో కలిసిపోయి ఉండేది'' అని అమిత్ షా ఫైరయ్యారు. దీనిపై..
అమిత్ షా కొడుక్కి అంత సీనుందా?
అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ''అమిత్ షా లాంటోళ్లు ఈ మధ్య తరచూ బెంగాల్ వచ్చి సవాళ్లు విసురుతున్నారు. ఫర్ ఎ ఛేంజ్, ఈసారి నేను వాళ్లను సవాలు చేస్తా.. అమిత్ షా ముందుగా నా అల్లుడు అభిషేక్ తో తలపడి, ఆ తర్వాత నా దగ్గరికి రావాలి. అభిషేక్ చాలా ఈజీగా రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని కాదనుకుని, ప్రజల చేత ఎంపీగా ఎన్నికైన సమర్థుడు. మరి అమిత్ షా కొడుకు జై షాకు ఏం అర్హత ఉందని క్రికెట్ బోర్డుపైన కూర్చోబెట్టారు. దద్దమ్మ లాంటి తన కొడుకు జైషాను రాజకీయాల్లోకి తీసుకొచ్చే దమ్ము అమిత్ షాకు ఉందా?'' అని మమతా బెనర్జీ సవాలు విసిరారు. మొత్తంగా..
బీజేపీ, టీఎంసీ దొందూ దొందే..
సీఎం మమతా బెనర్జీ పాలనలో అభిషేక్ జోక్యం, ఆమె నిర్ణయాలపై అతని ముద్ర, అధికారులు, పార్టీ నేతలపై పెత్తనానికి సంబంధించి ఇప్పటికే చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. ఇవాళ్టి సభల్లో అమిత్ షా కూడా వాటినే ప్రస్తావించారు. ఇటు అమిత్ షా తనయుడైన జైషా సంపద ఇటీవల కాలంలో భారీగా పెరగడం, కోట్ల రూపాయాల ఆదాయం తెచ్చే బీసీసీఐకి జైషాను కార్యదర్శిగా ఏ అర్హతతో నియమించారనే విమర్శలు, ఆరోపణలు కూడా అభిషేక్ కంటే ఎక్కువగా వెల్లువెత్తాయి. అర్హత లేకపోయినా, వారసులను అందలాలు ఎక్కించడంలో బీజేపీ, టీఎంసీలు దొందూ దొందే అని ప్రస్తుతం బెంగాల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. మమత, అమిత్ షాలు పరస్పరం తిట్టుకునే క్రమంలో అసలు నిజాలను కక్కేశారని జనం మాట్లాడుకుంటున్నారు.
ఫేస్బుక్ సంచలనం: వార్తా సేవలు బంద్ -మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలన్న చట్టాన్ని నిరసిస్తూ..