మమత రూపంలో కొత్త సీబీఐ డైరెక్టర్ రిషి శుక్లాకు తొలి సవాలు
ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా సోమవారం విధుల్లో చేరారు. బాధ్యతలు తీసుకోగానే ఆయన ముందు ఉన్న తొలి సవాలు బెంగాల్ రాష్ట్రం నుంచి ఎదుర్కొంటున్నారు. శారదా చిట్ ఫండ్ స్కామ్లో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సీబీఐ విచారణ చేసేందుకు అక్కడికి వెళ్లగా ఆ రాష్ట్రపోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఏకంగా సీఎం మమతా బెనర్జీనే రాజీవ్ కుమార్కు మద్దతుగా నిలిచారు. సీబీఐ చర్యను తప్పుబడుతూ ఆమె దీక్షకు దిగారు.
సీబీఐను జాతీయభద్రత సలహాదారుడు అజిత్ దోవల్ నడిపిస్తున్నారనే ఘాటు వ్యాఖ్యలు మమతా చేశారు. అంతేకాదు కేంద్రానికి దమ్ముంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని దీదీ సవాల్ చేశారు. కోల్కతా మెట్రో ఛానెల్ వద్ద ఆదివారం రాత్రి నుంచి మమతా బెనర్జీ దీక్షలో కూర్చున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. మరి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీబీఐ డైరెక్టరు ఈ కేసును ఎలా పరిష్కరిస్తారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
శారదా చిట్ఫండ్ స్కామునకు సంబంధించి రాజీవ్ కుమార్ నేతృత్వంలో విచారణ జరిగింది. అయితే కొన్ని కీలక పత్రాలు అదృశ్యం అవడంతో రాజీవ్కుమార్ను ప్రశ్నించాలని సీబీఐ భావించింది. ఈ క్రమంలోనే తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు పంపింది. అయితే విచారణకు రాజీవ్ కుమార్ హాజరుకాకపోవడంతో సీబీఐ ఆయన్ను విచారణ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
కొన్ని రోజుల తర్జన భర్జన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం కొత్త సీబీఐ అధికారిగా రిషికుమార్ శుక్లాను నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్ డీజీపీగా, ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టరుగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన్ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛీఫ్గా ఆయన బదిలీ అయ్యారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. విచారణ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరనుంది. మరి ఈ కేసులో రిషికుమార్ శుక్లా ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాలి.