పార్లమెంటులో ఇవాళ జరిగిందిదీ-వ్యవసాయ బిల్లులు వెనక్కి-చర్చలేకపోవడంపై విపక్షాల ఫైర్
పార్లమెంటు శీతాకాల సమావేశాలు తొలిరోజు హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే అదే సమయంలో ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం తగిన ప్రక్రియ చేపట్టకపోవడంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. పార్లమెంటు ఉభయసభల్లో నిరసనలకు దిగాయి. అయితే కేంద్రం ఇవేవీ లెక్క చేయలేదు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజు కేంద్ర ప్రభుత్వం తొలుత లోక్ సభలోనూ, ఆ తర్వాత రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకునేందుకు కొత్త బిల్లుల్ని ప్రతిపాదించింది. అంతే విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. దీనిపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళం నెలకొంది. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు ఇరు సభలు వాయిదా పడ్డాయి. అనంతరం తిరిగి ప్రారంభమైన మళ్లీ అదే గందరగోళం. దీంతో స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ మళ్లీ సభల్ని మధ్యాహ్నం రెండు గంటల వరకూవాయిదావేశారు. అనంతరం లోక్ సభలో, రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల రద్దు ప్రక్రియ మూజువాణి ఓటు సాయంతో పూర్తయిపోయింది. దీంతో విపక్షాలు తీవ్రంగా నిరసించాయి.
అనంతరం సభలో చర్చకు పట్టుబట్టినా సభాధ్యక్షులు ఒప్పుకోలేదు. సభల్ని ముందుకు నడిపే పరిస్ధితులులేకపోవడంతో తొలుత లోక్ సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.అయితే రాజ్యసభలో మాత్రం పరిస్ధితులు మరీ ఉద్రిక్తంగా మారాయి. దీంతో రాజ్యసభ ఛైర్మన్ ఏకంగా 12 మంది ఎంపీల్ని దురుసుప్రవర్తన కింద సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజ్యసభ కూడా ఎలాంటి చర్చలు లేకుండా రేపటికి వాయిదా పడిపోయింది.
పార్లమెంటులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసింది. వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి పార్లమెంటు ఉభయసభల్ని విపక్షాలు స్తంభింపజేశాయి. దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. అయినా కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవసాయ చట్టాల్ని రద్దును ఆమోదించేసింది.
పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసిన విధానంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. చర్చ లేకుండా ఆమోదించారు, చర్చ లేకుండానే రద్దు చేశారు. ఇదేం ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలో ఇదో కొత్త మోడలా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో కేంద్రం చర్యల్ని ఎండగడుతూ అబ్దుల్లా చేసిన ట్వీట్ వైరల్ అయింది.
అనంతరం వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021పై చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాము. కానీ లోక్సభలో ఈ బిల్లును హడావుడిగా ఆమోదించడంతో, వారు (ప్రభుత్వం) తాము రైతులకు అనుకూలంగా ఉన్నామని నిరూపించాలని అనుకుంటున్నారంటూ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఎన్డీయే సర్కార్ ను మరో ట్వీట్ లో తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి మాట్లాడుతున్న ఫోటోను కూడా ఈ ట్వీట్ కు జతచేశారు.
ఇవాళ పార్లమెంటు హైలెట్స్
- ఉదయం పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజు ప్రారంభం
- ఇరు సభల్లోనూ వ్యవసాయ బిల్లుల రద్దుపై నిరసనలు
- లోక్ సభ, రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లుల రద్దు బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
- ఇరు సభల్లోనూ విపక్షాల తీవ్ర నిరసనలు, చర్చకు డిమాండ్
- ఇరు సభల్లోనూ చర్చ లేకుండానే వ్యవసాయ బిల్లుల రద్దు బిల్లులు ఆమోదం
- కేంద్రం చర్యతో మండిపడ్డ విపక్షాలు- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
-రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్
- వ్యవసాయ బిల్లుల ఆమోదం, రద్దు చర్చ లేకుండానే ముగించడంపై విపక్షాల నిరసనలు, ట్వీట్లు
- ఉభయ సభలు రేపటికి వాయిదా