కోవిడ్ వ్యాక్సిన్ వికటించి దేశంలో తొలి మరణం.... నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడి
కోవిడ్ వ్యాక్సిన్ వికటించి 68 ఏళ్ల ఓ వ్యక్తి మరణించినట్లు వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ( AEFI-The National Adverse Event Following Immunisation) నివేదిక వెల్లడించింది. వ్యాక్సిన్ దుష్ప్రభావంతో దేశంలో తొలి మరణం సంభవించినట్లయింది. గతంలో వ్యాక్సిన్ వికటించి పలువురు మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ... వ్యాక్సిన్తో ఆ మరణాలకు సంబంధం లేదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది.
నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం...వ్యాక్సిన్ దుష్ప్రభావాలతో మరణించినట్లుగా చెప్పబడుతున్న 31 కేసులను నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. ఇందులో 68 ఏళ్ల ఓ వృద్దుడు వ్యాక్సినేషన్ తర్వాత అనాఫిలాక్సిస్ బారినపడినట్లు గుర్తించారు. మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతను అనాఫిలాక్సిస్ బారినపడినట్లు తేల్చారు. దాని కారణంగానే అతను మృతి చెందినట్లు నిర్దారించారు.అయితే దీనిపై స్పందించేందుకు ఏఈఎఫ్ఐ ఛైర్ పర్సన్ డా.ఎన్కే అరోరా తిరస్కరించారు.
అనాఫిలాక్సిస్ అనేది ప్రాణాంతక అలర్జిక్ రియాక్షన్.దీని బారినపడితే చర్మంపై దద్దుర్లు,రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం,శ్వాసకోశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాక్సినేషన్తో ముడిపడి మరణం సంభవించిన కేసులు మరో మూడు ఉన్నప్పటికీ... నిపుణుల కమిటీ మాత్రం ఒక్క మరణాన్నే ధ్రువీకరించింది. వ్యాక్సినేషన్ తర్వాత 16,19 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో అనాఫిలాక్సిస్ బారినపడ్డారు. అయితే వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు.
అధ్యయనం చేసిన మొత్తం 31 కేసుల్లో... 18 మంది యాధృచ్చికంగా టీకా తీసుకున్న తర్వాత మరణించారని నిపుణుల కమిటీ వెల్లడించింది. ఈ మరణాలకు వ్యాక్సినేషన్కు సంబంధం లేదని స్పష్టం చేసింది. మరో ఏడు మరణాలపై అనిశ్చితి నెలకొనగా,మరో రెండు కేసులు వర్గీకరించలేనివిగా గుర్తించింది. వీటికి సంబంధించి కీలక సమాచారం మిస్ అవడం వల్ల వాటిని అంచనా వేయలేకపోయినట్లు తెలిపింది.