నేల కూలిన వాయుసేన ఎయిర్క్రాఫ్ట్ తొలి పిక్ ఇదే!
ఇటానగర్: ఈ నెల 3వ తేదీన గల్లంతైన మనదేశ వైమానిక దళానికి చెందిన ఆంటొనొవ్-32 ఎయిర్క్రాఫ్ట్ శకలాలకు సంబంధించిన తొలి ఫొటో విడుదలైంది. ఆకాశమార్గం నుంచి శకలాలను గుర్తించిన వెంటనే వైమానిక దళ వింగ్ కమాండర్లు ఈ ఫొటోను తీశారు. ఏఎన్-32 ఎయిర్క్రాఫ్ట్కు చెందిన శకలాలు, దాని సమీపంలో మాడి మసి అయిన పచ్చని చెట్లు ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విమానం శకలాలను మంగళవారం మధ్యాహ్నం అరుణాచల్ ప్రదేశ్లోని షియాంగ్ జిల్లాలోని దట్టమైన అడవుల్లో పాయుమ్ ప్రాంతంలో వాయుసేన సిబ్బంది గుర్తించిన విషయం తెలిసిందే. ఏఎన్-32 ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి గురైన ప్రదేశం సముద్రమట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో ఉన్నట్లు తేలింది. ప్రమాద సమయంలో ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణిస్తోన్న 13 మంది వైమానిక సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు వైమానిక దళ అధికారులు.
ఈ నెల 3వ తేదీన అసోంలోని జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న మెఛుకాలోని వైమానిక దళ బేస్ క్యాంపునకు బయలుదేరిన ఏఎన్-32 ఎయిర్క్రాఫ్ట్ మార్గమధ్యలో గల్లంతయిన విషయం తెలిసిందే. దీని ఆచూకీని కనుగొనడానికి వాయుసేనకు చెందిన సుఖోయ్-30, ఎంఐ-17 యుద్ధ విమానాలతోపాటు సైనికులు, అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇస్రో సహాయాన్ని కూడా తీసుకున్నారు. అయినప్పటికీ.. దాని జాడ కానరాలేదు.
మంగళవారం గాలింపు సందర్భంగా ఎంఐ-17 విమానంలోని అధికారులు ఏఎన్-32 శకలాలను పాయుమ్ వద్ద గుర్తించారు.జోర్హట్ నుంచి బయలుదేరే సమయంలో ఇందులో మొత్తం 13 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ లభించట్లేదు. వారందరూ మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు.