Coronavirus : భారత్లో నమోదైన మొదటి కేసులో ట్విస్ట్.. తాజా రిపోర్ట్స్లో ఏం తేలిందంటే..
భారత్లో నమోదైన మొట్టమొదటి కరోనా వైరస్ కేసు విషయంలో అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. త్రిసూర్కి చెందిన ఆ పేషెంట్ శాంపిల్స్ను కేరళలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)లో పరీక్షంచగా నెగటివ్ అని తేలింది. ఈ నెల 30న అతనికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్దారించగా.. 10 రోజుల వ్యవధిలో అతనికి కరోనా నెగటివ్ అని తేలడం గమనార్హం.

పుణే ల్యాబ్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది..
కేరళలోని ఎన్ఐవీ ఇచ్చిన రిపోర్ట్స్లో నెగటివ్ అని తేలినప్పటికీ.. పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) రిపోర్ట్స్ కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు. అందులోనూ నెగటివ్ అని తేలితే అతనికి కరోనా వైరస్ సోకనట్టే. ఒకవేళ పాజిటివ్ అని తేలితే మాత్రం వైద్యపరంగా మరింత జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది.

త్రిసూర్లో మొదటి కేసు..
త్రిసూర్లో నమోదైన మొట్టమొదటి కరోనా వైరస్ కేసులో.. సదరు పేషెంట్ చైనాలోని వుహాన్ పట్టణంలో చదువుకుంటున్నాడు. కరోనా వైరస్ బయటపడ్డ తర్వాత అతను కేరళకు తిరిగివచ్చాడు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డులో అతనికి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటివరకు మూడు కేసులు..
భారత్లో ఇప్పటివరకు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనా నుంచి తిరిగొచ్చినవారిని ఐసోలేషన్ వార్డుల్లో వైద్య పర్యక్షవేణలో ఉంచారు. ఇప్పటికైతే ఆందోళన చెందాల్సినంత పరిస్థితేమీ కనిపించడం లేదు. విదేశాల నుంచి తిరిగొచ్చేవారికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు 1,118 విమానాలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.

పెరిగిన మృతుల సంఖ్య
ఇక కరోనా వైరస్ బారినపడి చైనాలో ఇప్పటివరకు 910 మంది మృతి చెందారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య 40వేలకు పెరిగింది. కరోనా సోకిన మరో 3281 మంది పేషెంట్లు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 3.99లక్షల మందిలో కరోనా లక్షణాలను గుర్తించారు. మరో 1.87లక్షల మందిని మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచారు.












Click it and Unblock the Notifications