"మహా'' సమరం: మహారాష్ట్ర అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా నేడు విడుదల
న్యూఢిల్లీ:మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఈ సారి అందరి దృష్టి మహారాష్ట్ర సమరంపైనే ఉంది. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ తమ రేసుగుర్రాలను దాదాపు ఫైనలైజ్ చేసింది. ఆదివారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన అగ్రనేతలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు.
సోమవారం రోజున రెండు రాష్ట్రాల్లోని తమ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను బీజేపీ విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే అభ్యుర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు అక్టోబర్ 4. హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లనుంది. ఆయన సొంత నియోజకవర్గం కర్నాల్ నుంచి ఖట్టర్ మళ్లీ పోటీ చేయనున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీలోకి చాలామంది ప్రముఖలు వచ్చి చేరుతున్నారు. దీంతో కమలదళం బలంగా కనిపిస్తోంది. ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్, భభితా పోగట్, హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్లు ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. వీరంతా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక శివసేనతో పొత్తు ఇతర అంశాలకు సంబంధించిన విషయాలు మంగళవారం ముంబైలో ప్రకటించనుంది కమలం పార్టీ.
రాశి..రంభకు కోర్టు వార్నింగ్: వారిద్దరి మీద ఫిర్యాదు: అసలేం జరిగిందంటే..!
ఇప్పటికే శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తమ అభ్యర్థులకు ఏ-బీ ఫారంలు అందజేశారు. ఇందులో తన కొడుకు ఆదిత్య థాక్రే కూడా ఉన్నారు. దీంతో ఆదిత్య థాక్రే తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆయన ముంబైలోని ఓర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 3న ఆదిత్య థాక్రే నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఆదివారం బీజేపీ సమావేశం తర్వాత శివసేనకు 124 స్థానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 228 స్థానాలు ఉన్నాయి.
ఆదివారం బీజేపీ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పాటు ఇదర పార్టీ ఎన్నికల సంఘం సభ్యులు సమావేశమయ్యారు. గంటల పాటు చర్చించి అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తానికి మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్లీ ఫడ్నవీస్ ఉంటుండగా, హర్యానా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖట్టర్ ఉంటున్నారు. మోడీ చరిష్మా పాపులారిటీ, జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు బీజేపీని తిరిగి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొస్తాయనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు.