నో మాస్క్ - నో ఓట్: ఉదయం 7 నుంచి పోలింగ్ షురూ - బీహార్ తొలి దశ సంగ్రామం - ఇవీ విశేషాలు..
కరోనా విలయ కాలంలో జరుగుతోన్న తొలి ఎన్నికలుగా, ఆర్థిక వ్యవస్థ పతనం తర్వాత పార్టీలకు సవాలుగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరాయి. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల షెడ్యూల్ విడుదలకాగా, తొలి దశ పోలింగ్ బుధవారం జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కొవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ముగిసిన మొదటి దశ ప్రచారం-71 సీట్లకు 28న పోలింగ్-2.14కోట్ల ఓటర్లు-1066 అభ్యర్థులు-పూర్తి లెక్కలివే..
తొలి దశలో భాగంగా 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. సోమవారం సాయంత్రమే ప్రచారం ముగియడంతో మంగళవారం ఎన్నికల సిబ్బంది ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లారు. గతంలో కంటే ఈసారి పోలీస్, పారామిలటరీ బలగాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే నక్సల్స్ ప్రభావిత సెగ్మెంట్లలో మాత్రం గంటలు ముందుగానే ప్రక్రియ ముగించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి బూత్ ల సంఖ్యను భారీగా పెంచారు.
సాధారణంగా ఒక్కో పోలింగ్ బూత్ లో 1600 ఓటర్లకు అవకాశం కల్పిస్తూ వచ్చిన ఈసీ.. బీహార్ ఎన్నికల్లో మాత్రం ఒక బూత్ లో ఓట్ల సంఖ్యను 1000కి పరిమితం చేసి, కేంద్రాల సంఖ్యను పెంచింది. 71 సెగ్మెంట్లలో మొత్తం 31వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిజికల్ డిస్టెన్స్ ను అనుసరిస్తూ ఓటర్లకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం, చేతుల్ని శానిటైజ్ చేసుకోవడాన్ని తప్పినిసరి చేశారు. మాస్కు లేనివాళ్లను లోనికి అనుమతించబోరు.
ఇంకొద్ది గంటల్లో నిమ్మగడ్డ అఖిలపక్షం -హాజరుపై ఎటూ తేల్చని జగన్, పవన్ - స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ
తొలి దశలోని 71 నియోజకవర్గాల్లో మొత్తం 2.14కోట్ల మంది ఓటర్లు.. 1066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని బుధవారం నిర్ణయించనున్నారు. మొత్తం ఓటర్లలో 1.01కోట్ల మంది మహిళలు, 599 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. జేడీయూ నాయకత్వంలో బీజేపీ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీలు ఎన్డీఏ కూటమిగా పోటీచేస్తుండగా, ఇదే కూటమిలోని ఎల్జేపీ మాత్రం విడిగా బరిలోకి దిగింది. ఆర్జేడీ నాయకత్వంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) పార్టీలు మహాకూటమిగా తలపడుతున్నాయి. నవంబర్ 3న రెండో, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ జరుగనుంది.