మోడీకి షీలా ప్రశంస, పైలట్ కోసం కేసీఆర్ వెయిటింగ్
న్యూఢిల్లీ/కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్న కాంగ్రెస్ నేతల జాబితా పెరుగుతోంది! మాజీ కేంద్రమంత్రులు శశిథరూర్, గులాం నబీ ఆజాద్లు వివిధ సందర్భాలలో మోడీని మెచ్చుకున్నారు. తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ప్రధాని పైన ప్రశంసలు కురిపించారు.
సమాచారం మేరకు.. తాను గత జూలైలో మోడీని కలిశానని, అతనిలో తాను దృఢ విశ్వాసం, విజన్ చూశానని కితాబిచ్చారు. అంతలోనే ఆమె మాట్లాడుతూ అయితే, ఆయన ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
దీని పైన బీజేపీ నేత మీనాక్షి లేఖి స్పందించారు. మోడీ పాలనను షీలా దీక్షిత్ ప్రశంసించడం తప్పు కాదని అన్నారు. మోడీ సమర్థవంతంగా పాలన అందిస్తున్నందునే షీలా మెచ్చుకున్నారని తెలిపారు. ఒక ప్రత్యేక విజన్తో మోడీ పాలన సాగుతోందన్నారు. గెలిచే ప్రతి వ్యక్తిలోను విశ్వాసం కనిపిస్తుందన్నారు.
కేసీఆర్ పర్యటనలో పైలట్లు మిస్సింగ్
కరీంనగర్లో మంగళవారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైలట్ల కోసం నిరీక్షించవలసి వచ్చింది. బోయినపల్లి వెంకట రామారావు అంత్యక్రియలకు హాజరు కావడానికి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వచ్చారు. కార్యక్రమం పూర్తి అయిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు వెళ్లడానికి సన్నద్ధమై కాన్వాయ్లో హెలిప్యాడ్కు చేరుకున్నారు.
కేసీఆర్ అక్కడికి చేరుకునేసరికి పైలట్లు కనిపించలేదు. అందరూ కంగారు పడ్డారు. పైలట్లు హెలికాప్టర్ దగ్గర లేరన్న విషయం తెలిసి కేసీఆర్ వారు వచ్చే వరకూ కారులోనే ఉండిపోయారు. తర్వాత దాదాపు 20 నిమిషాల తర్వాత పైలట్లు వచ్చి హెలికాప్టర్ను బయలుదేరదీశారు.
అప్పటివరకూ ఆ పైలట్లకోసం అటూ ఇటూ పరుగులు తీసిన వారంతా ముఖ్యమంత్రి సురక్షితంగా వెనుకకు బయలుదేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసీఆర్తో పాటు మంత్రులు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు కూడా ఉన్నారు. కాగా, పైలట్లు అల్పాహానికి వెళ్లారని తెలుస్తోంది.