దేశ చరిత్రలో తొలిసారి రైతులు, కార్మికులకు మేలు చేసే చట్టాలు చేశాం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు, కార్మిక చట్టాలు దేశ ప్రజల ప్రయోజనాల కోసమేనని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. పార్టీ సిద్ధాంత కర్త దీన్దయాల్ 104వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
ముఖ్యంగా 86 శాతం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వాలు, వారి వాగ్ధానాలను గాలికి వదిలేశాయని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రైతులకు, కూలీలకు అబ్ధాలు చెబుతూనే ఉన్నారని, తాజా సంస్కరణలపై ఇప్పుడు కూడా రైతులను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంటలకు కనీస మద్దతు ధర పెంచడంలో రికార్డు సృష్టించామని ప్రధాని మోడీ తెలిపారు. తాజాగా, తీసుకొచ్చిన కార్మిక చట్టాల వల్ల దాదాపు 50 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు సరైన సమయంలో వేతనాలు అందుతాయన్నారు.
ఇప్పటి వరకు కేవలం 30 శాతం మంది కార్మికులు మాత్రమే కనీస వేతనాలు పొందేవారని, ప్రస్తుతం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ ప్రయోజనాలు వర్తిస్తాయని అన్నారు. భారత చరిత్రలో తొలిసారి రైతులకు, కార్మికులకు లబ్ధి చేకూర్చే చట్టాలను చేయడం జరిగిందన్నారు. మొదట దేశం అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామన్నారు. వ్యవసాయంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, వాటి ప్రయోజనాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మోడీ బీజేపీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు.