దేశ చరిత్రలో తొలిసారి: ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష!
న్యూఢిల్లీ/ముంబై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన నేపథ్యంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష అమలు కానుంది. చిన్నారులను అపహరించి, హత్య చేసిన కేసులో దోషులైన మహారాష్ట్రలోని కొల్హాపూర్కు అక్కాచెల్లెళ్లను త్వరలోనే ఉరితీయనున్నట్లు సమాచారం.
మహారాష్ట్రలో 1990-96 మధ్య కాలంలో అంజనా గవిట్, ఆమె ఇద్దరు కుమార్తెలు రేణుకా, సీమా, అల్లుడు కిరణ్ షిండేలు కొల్హాపూర్, సాంగ్లీ, సతారా జిల్లాల్లో భిక్షాటన చేయించేందుకు 13 మంది చిన్నారులను అపహరించారు. వీరిలో ఎదురుతిరిగిన 9మందిని అత్యంత దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపారు.
కాగా, ఈ కేసులో కిరణ్ షిండే సాక్షిదారుడిగా ఉన్నాడు. కేసు విచారణలో ఉండగానే 1997లో నిందితురాలైన అంజనా గవిట్ మృతి చెందింది. ఆమె కుమార్తెలు రేణుకా, సీమా గవిట్లను న్యాయస్థానం 2001లో దోషులు పేర్కొంది. వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
దోషులైన రేణుకా, సీమా క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది జులై నెలలో తిరస్కరించిన విషయం తెలిసిందే. తదనంతరం చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సమయం శనివారం (ఆగస్టు 16)తో ముగియనుంది. దీంతో వారికి త్వరలోనే ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రేణుకా, సీమా మహారాష్ట్రలోని పుణెలోని యెరవాడ సెంట్రల్ జైలులో ఉన్నారు.