రజనీకాంత్ ఎఫెక్ట్: బిజెపిపై తొలిసారి జయలలిత ఆగ్రహం
ఎన్నికల అనంతరం ఆమె ఎన్డీయేలోకి వస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే, రజనీకాంత్తో మోడీ భేటీ కావడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. తమిళనాడుకు బిజెపిలో పెద్దగా క్యాడర్ లేదు. రజనీతో భేటీ కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అది తమకు గండి కొడుతుందని జయలలిత ఆందోళన చెందుతున్నారట. దీంతో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె బిజెపిని నేరుగా అంతగా విమర్శించింది లేదు.
కానీ, రజనీతో మోడీ భేటీ నేపథ్యంలో ఆమె బిజెపిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెసు, బిజెపిలు ఒక్కటేనని ఆరోపించారు. తీవ్రమైన భావోద్వేగాలతో కూడుకున్న కావేరీ నదీ జలాల సమస్యపై కేంద్రంలోని అధికార కాంగ్రెస్ అనురిస్తున్న వైఖరికి, ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి అనుసరిస్తున్న వైఖరికి తేడా ఏమీ లేదని కరూర్, పెరంబలూర్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ధ్వజమెత్తారు.
ప్రస్తుతం సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో లోకసభ సీట్లు గెలుచుకోవడమే పరమావధిగా పెట్టుకున్న బిజెపి తమ ఎన్నికల ప్రణాళికలో కావేరీ నదీ జలాల సమస్యను మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదని ఆమె మండిపడ్డారు. దీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న కావేరీ జలాల వివాదం విషయంలో తమిళనాడుకు కాంగ్రెస్, డిఎంకె, బిజెపి నమ్మక ద్రోహం చేశాయని ఆరోపించారు.
ప్రస్తుతం జరుగనున్న లోకసభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీల అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చేసి ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తాత్కాలిక తీర్పును అమలు చేయాలని తాను చేసిన విజ్ఞప్తులను అప్పటి ప్రధాన మంత్రి అతల్ బిహారీ వాజపేయి పట్టించుకోకపోవడం వల్లనే ఎఐఎడిఎంకె 1999లో ఎన్డీయే నుండి వైదొలగినట్లు చెప్పారు.