సన్నీడియోల్ హేమామాలినిలు సభలో ఒకే దగ్గర కూర్చోరట...కారణం ఇదే...!
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత జూన్ 6న తొలి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా లోక్సభలో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో డిసైడ్ అయిపోయింది. తొలిసారి లోక్సభలో అడుగుపెడుతున్న సన్నీ డియోల్కు తన సవితి తల్లి అలనాటి బాలీవుడ్ అందాల భామ హేమ మాలిని అండగా ఉంటుందనుకున్నాడు. కానీ సన్నీ డియోల్ ఆశలు నెరవేరడం లేదు. ఇందుకు కారణం పార్లమెంటులో సీటింగ్ ముందుగానే నిర్ణయం చేయడం జరిగింది.
లోక్సభకు తొలిసారిగా ఎన్నికైన 300 మంది ఎంపీలు
17వలోక్సభలో 300 మంది ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారు. సన్నీ డియోల్తో సహా తొలిసారిగా లోక్సభలో అడుగుపెడుతున్న ప్రముఖుల్లో సింగర్ హన్స్రాజ్ హన్స్, క్రికెటర్ గౌతం గంభీర్, సాధ్వీ ప్రగ్యా సింగ్, నటులు రవికిషన్లు ఉన్నారు. అయితే వీరు బయట ప్రపంచంలో సెలబ్రిటీలుగా ఉన్నప్పటికీ మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ... లోక్సభలో మాత్రం వీరు తొలిసారి అడుగుపెడుతున్నందున వీరికి వెనక బెంచీల్లో స్థానం కేటాయించారు. అధికార సీటింగ్ సిస్టం ప్రకారం ముందు బెంచీల్లో ఒక్కసారికంటే ఎక్కువగా ఎన్నికైన సభ్యులకే తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
తొలిసారి ఎంపీగా ఎన్నికైన పలువురు ప్రముఖులు
ఉదాహరణకు హేమా మాలిని లోక్సభకు ఎన్నిక కావడం ఇది రెండో సారి. ఆమెకు లోక్సభ హాలులో మధ్య బెంచీల్లో స్థానం కేటాయించారు. అయితే ఆమె సవితి కొడుకు సన్నీడియోల్ తొలిసారి గురుదాస్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఆయనకు వెనక బెంచీల్లో సీట్లు కేటాయించారు. ఇదే క్రమంలో సాద్వీ ప్రగ్యా అనురాగ్ ఠాకూర్ వెనకాల కూర్చోనున్నారు. అనురాగ్ ఠాకూర్ కంటే వయస్సులో చాలా పెద్దదైన సాద్వీ లోక్సభలో మాత్రం ఆయన కంటే జూనియరే. అనురాగ్ ఠాకూర్ నాలుగోసారి గెలుపొంది లోక్సభలో అడుగు పెడుతున్నారు.
పార్లమెంటులో సీటింగ్ వ్యవస్థ ఇలా ఉంటుంది
లోక్సభలో ప్రతి ఎంపీకి ఒక సీటింగ్ విధానం కలిగి ఉంటుంది. ఇది ఒక ఫార్ములాను అనుసరించి కేటాయించడం జరుగుతుంది. స్పీకర్కు కుడివైపున ఉన్న బెంచీల్లో అధికార పక్షంతో పాటు మిత్రపక్షాలు కూర్చుంటాయి.ఇక స్పీకర్కు ఎడమవైపున విపక్షపార్టీలు కూర్చుంటాయి. ఇక కుడివైపున ఉన్న ముందు వరుసలో ప్రధానితో పాటు కేబినెట్ మంత్రులు ఆసీనులవుతారు. ఎడమవైపున విపక్ష పార్టీ అధినేతతో పాటు ఇతర విపక్ష పార్టీల నాయకులు కూర్చుంటారు.ఇందులోనే డిప్యూటీ స్పీకర్ కూడా కూర్చుంటారు. ఇక మధ్యలో ఉన్న బెంచీలు సీనియారిటీ ప్రకారం కేటాయిస్తారు. ఇక చివరి బెంచీలు ఎప్పటిలానే తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్న ఎంపీలకు కేటాయిస్తారు. అయితే తొలిసారి అడుగుపెట్టినప్పటికీ... వారిని మంత్రి పదవి వరిస్తే వారు కూడా ముందు వరుసలో కూర్చుంటారు.