రిపబ్లిక్ డే పరేడ్లో మెరిసిన రాఫెల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలెట్: ఆమె ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశం మొత్తం ఇవ్వాళ 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని చోట్లా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు.. వైభవంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ను నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి, సగౌరవంగా వందనం చేశారు. ఏపీ, తెలంగాణ గవర్నర్లు, బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్.. గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.
అటు దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు ఆకాశాన్ని అంటాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరేడ్ రక్షణరంగం సత్తా చాటేలా సాగింది. మిగ్-21, జీనాట్, లైట్ కొంబాట్ హెలికాప్టర్, అశ్లేష రాడార్, రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శనలు కనువిందు చేశాయి.
ఈ పరేడ్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచారు ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మంగా కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళా పైలెట్ ఆమె. రాఫెల్ యుద్ధ విమానాలతో రూపొందించిన శకటంపై నిల్చుని- జాతీయ పతాకాన్ని స్టిఫ్గా సెల్యూట్ చేస్తూ కనిపించారు. రాఫెల్ జెట్ ఫైటర్లు భారత్కు చేరుకున్న తొలిరోజుల్లోనే ఆమె ఫ్లైట్ లెప్టినెంట్గా జాయిన్ అయ్యారు. గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్లో చేరారు.
శివాంగి సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని వారణాసి. చిన్నప్పటి నుంచి ఆకాశంలో విహరించాలనేది ఆమె కల. దాన్ని సాకారం చేసుకున్నారు. వైమానిక దళంలో చేరారు. 2017 డిసెంబర్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ ప్రతిభతో కలిసి ఎయిర్ ఫోర్స్లో చేరారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థిని శివాంగి సింగ్. వైమానిక దళంలో చేరాలనే లక్ష్యంతో 2016లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందారు. విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఎన్సీసీ యూపీ ఎయిర్ స్క్వాడ్రన్లో పని చేశారు.