కేఫ్ కాఫీ డే అధినేత మిస్సింగ్ పై మత్స్యకారుల కీలక సమాచారం
బెంగళూరు: కేఫ్ కాఫీ డే అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ జాడ తెలియరావట్లేదు. ఆయన కోసం నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. మంగళూరులోని నేత్రావతిలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. అయినప్పటికీ.. ఆయన ఆచూకీ తెలియరావట్లేదు. నౌకాదళం, తీర ప్రాంత రక్షక బలగాలు సిద్ధార్థ కోసం అన్వేషిస్తున్నాయి. మంగళూరు నుంచి కేరళకు దారి తీసే హైవే మీద నేత్రావతి నదిపై నిర్మించిన బ్రిడ్జి వద్ద ఈ గాలంపు చర్యలు కొనసాగుతున్నాయి. వీజీ సిద్ధార్థ చివరిసారిగా కనిపించింది అక్కడే.
కొత్త స్పీకర్ వచ్చేశారు..! సీనియర్ ఎమ్మెల్యే నామినేషన్.. పోటీ లేనట్టే
ఓ వ్యక్తి నదిలో దూకడాన్ని కళ్లారా చూశాం:
సోమవారం రాత్రి ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి నదిలో దూకడాన్ని తాము కళ్లారా చూశామని ఇద్దరు మత్స్యకారులు చెబుతున్నారు. బ్రిడ్జికి చెందిన ఎనిమిదవ స్థంభం వద్ద రెయిలింగ్ పైకి ఎక్కి, నదిలో దూకాడని అన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడని గ్రహించిన తాము గట్టిగా కేకలు వేశామని చెప్పారు. ఆ సమయంలో నది ప్రవాహం ఉధృతంగా ఉందని అన్నారు. నదిలో దూకిన వెంటనే సుమారు 50 మీటర్ల వరకు ఆ వ్యక్తి కొట్టుకెళ్లాడని, ఆ తరువాత కనిపించలేదని మత్స్యకారులు చెప్పారు. అతణ్ని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని అన్నారు. వారు ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కలిసేది సముద్రంలోనే..
నేత్రావతి నది జన్మస్థానం గంగమూల. పశ్చిమ కనుమల్లో ఉండే ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తుంటుంది. కొద్దిరోజులుగా పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా- నేత్రావతికి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. పరవళ్లు తొక్కుతోంది. మంగళూరు తీర ప్రాంత పట్టణం ఉల్లాళ వద్ద సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం తీర ప్రాంత రక్షక బలగాలు బంట్వాళ వరకు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ- ఎలాంటి జాడ తెలియరాలేదు.